న్యూఢిల్లీ/హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కొవిడ్-19 ఉప రకం జేఎన్.1 కేసులు పెరుగుతున్నాయి. ఆదివారం వరకు దేశవ్యాప్తంగా ఈ తరహా కేసులు 63 నమోదయ్యా యి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం, రాష్ర్టాల ప్రభుత్వాలు కోరాయి. దేశంలో సోమవారం 628 తాజా కరోనా కేసులు నమోదయ్యాయని.. యాక్టివ్ కేసుల సంఖ్య 4,054కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనాతో కేరళలో ఒకరు చనిపోయారు. కొద్ది వారాలుగా కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తున్నది. అయితే దవాఖానలో చేరి చికిత్స పొందతున్నవారి సంఖ్య తక్కువగానే ఉన్నది.
కొత్తగా 10 కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. సోమవారం 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్లో 9, కరీంనగర్లో ఒక కేసు నమోదైనట్టు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. మొత్తం 989 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు తెలిపింది. దీంతో రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 55కు చేరిందని చెప్పింది. మరో 12 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నదని పేర్కొన్నది. ఆదివారం 8 కేసులు నమోదైనట్టు వివరించింది. భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచించింది.
ఒకే ఇంట్లో ఐదుగురికి..
జయశంకర్ భూపాలపల్లి గణపురం మండలం గాంధీనగర్లో ఓ వృద్ధురాలి కుటుంబంలోని ఐదుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వృద్ధురాలు వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతుండగా, మిగతా నలుగురిని హోంఐసొలేషన్లో ఉంచామని, వారు కోలుకుంటున్నారని, ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు.