న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్నది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది. 24 గంటల వ్యవధిలోనే 1,41,986 కరోనా కేసులు నమోదయ్యాయి. 228 రోజుల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,53,68,372కు చేరింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 3,071కి పెరిగాయి. మహారాష్ట్రలో అత్యధికంగా 876 ఒమిక్రాన్ కేసులు నమోదు కాగా, ఢిల్లీలో 513 కేసులు నిర్ధారణ అయ్యాయి. కర్ణాటకలో 333, రాజస్థాన్లో 291, కేరళలో 284, గుజరాత్లో 204 ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయి. కరోనా కారణంగా తాజాగా 285 మరణాలు సంభవించగా, మొత్తం మరణాల సంఖ్య 4,83,463కు చేరింది. ప్రస్తుతం 4,72,169 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు కూడా 97.30 శాతానికి తగ్గినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. రోజువారీ పాజిటివిటీ రేటు 9.28 శాతంగా నమోదైంది.
పెరుగుతున్న ఆర్-నాట్ వ్యాల్యూ
కొవిడ్-19 వ్యాప్తిని సూచించే ఆర్-నాట్ వ్యాల్యూ దేశవ్యాప్తంగా ఈ వారం 4గా నమోదైందని ఐఐటీ మద్రాస్ ప్రాథమిక విశ్లేషణలో తేలింది. దీన్ని బట్టి దేశంలో ఇన్ఫెక్షన్ వ్యాప్తి చాలా వేగంగా జరుగుతున్నట్టు అర్థం అవుతున్నదని పేర్కొంది. ఫిబ్రవరి 1 నుంచి 15వ తేదీ మధ్య మూడో వేవ్ తీవ్రస్థాయికి (పీక్) చేరుకుంటుందని అంచనా వేసింది. గత వారంలో (డిసెంబర్ 25 నుంచి 31వరకు) ఆర్-నాట్ విలువ 2.9గా రికార్డయింది.
2 కోట్ల మంది పిల్లలకు వ్యాక్సిన్
15-18 ఏండ్ల వయసున్న పిల్లలకు ఇప్పటివరకు మొత్తం 2 కోట్ల మందికి కరోనా టీకా మొదటి డోసు అందించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో 90 లక్షల మంది పిల్లలకు వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.
పార్లమెంట్లో కరోనా కలకలం
పార్లమెంట్లో కరోనా కలకలం రేగింది. 350 మందికిపైగా సిబ్బందికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. గత రెండు రోజులుగా సిబ్బందికి అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు.