న్యూఢిల్లీ: బ్రిటన్ నుంచి భారత్కు వచ్చే యూకే పౌరులకు భారతదేశం గుడ్న్యూస్ చెప్పింది. భారత్కు వచ్చే బ్రిటన్ పౌరులు వ్యాక్సినేషన్ పూర్తయినా సరే పది రోజులపాటు క్వారంటైన్లో ఉండాలనే నిబంధనను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించింది. కొన్ని రోజుల క్రితం కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న భారత పౌరులు బ్రిటన్ వస్తే, వారిని వ్యాక్సిన్ తీసుకోని వారిగానే పరిగణిస్తామని బ్రిటన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్ ప్రతిఘటన తప్పదంటూ హెచ్చరికలు చేసింది. దీంతో కొవిషీల్డ్కు గుర్తింపునిస్తున్నట్లు యూకే ప్రకటించింది. అయితే భారత్లో ఇచ్చే వ్యాక్సినేషన్ ధ్రువీకరణపై అనుమానాలున్నాయని పేర్కొంది. కాబట్టి కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న భారతీయులు క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో భారత్ కూడా తమదేశానికి వచ్చే యూకే పౌరులకు పది రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది.
యూకే పౌరులు రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నా క్వారంటైన్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో ఖంగుతిన్న యూకే ఇటీవల తన నిర్ణయాన్ని మార్చుకుంది. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న భారతీయులు క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని వెల్లడించింది. ఈ క్రమంలోనే భారత్ వచ్చే యూకే పౌరులు కూడా క్వారంటైన్లో ఉండాల్సిన అవసరం లేదని, విదేశీ ప్రయాణికులపై ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదల చేసిన నిబంధనలే యూకేకు కూడా వర్తిస్తాయని బుధవారం నాడు భారత ప్రభుత్వం వెల్లడించింది.