హెచ్ఏసీలో చేరిన అమెరికా
ఇప్పటికే సభ్య దేశంగా భారత్
న్యూఢిల్లీ, ఏప్రిల్ 16: పుడమి రక్షణ కోసం అమెరికా ముందడుగు వేసింది. 2030 నాటికి భూమిపై ఉన్న 30% భూమిని, సముద్రాన్ని కాపాడే లక్ష్యంగా ఏర్పాటైన హై యాంబిషన్ కొయిలేషన్(హెచ్ఏసీ)లో చేరనున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే 90కి పైగా దేశాలు ఇందులో సభ్యత్వం కలిగి ఉన్నారు. పుడమి రక్షణకు తమ వంతు ప్రయత్నం చేస్తామని అవర్ ఓషియన్ కాన్ఫరెన్స్లో ఆ దేశ అంతర్జాతీయ పర్యావరణ, సైంటిఫిక్ వ్యవహారాల శాఖ మంత్రి మోనికా మదీనా ప్రకటించారు. అమెరికాలోని 30 శాతం భూమిని, సముద్రాన్ని కాపాడేందుకు బైడెన్ సర్కారు ఇప్పటికే చర్యలు చేపట్టిందని, ఇప్పుడు ప్రపంచ స్థాయిలో లక్ష్యాన్ని నిర్దేశించుకొంటున్నట్టు తెలిపారు. అమెరికా లో జీవవైవిధ్యాన్ని, జీవజాతులను కాపాడేందుకు 1 బిలియన్ డాలర్లతో ‘అమెరికా ది బ్యూటిఫుల్ చాలెంజ్’ కార్యక్రమం చేపట్టినట్టు పేర్కొన్నారు.
హెచ్ఏసీ లక్ష్యం ఏంటి?
పారిశ్రామికీకరణ వల్ల ప్రపంచ దేశాల మధ్య పోటీ ఏర్పడింది. ప్రకృతిని చేయాల్సినంత కలుషితం చేసేస్తున్నాయి. ఫలితంగా ఎన్నో జీవజాతులు కనుమరుగయ్యాయి. ఇప్పుడు ప్రకృతి సంక్షోభంలో పడింది. దీనిపై కొన్నేండ్లుగా శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నా రు. ఈ నేపథ్యంలో భూమిని, పర్యావరణాన్ని, జీవజాతులను కాపాడుకొనే లక్ష్యంతో హెచ్ఏసీ ఏర్పాటైంది. దీనిలో చేరిన దేశాలు 2030లోగా కనీసం 30 శాతం భూమి, సముద్రాన్ని కాపాడాలి. ఈ లక్ష్యాన్ని 30*30గానూ అభివర్ణిస్తున్నారు. 30*30 అంటే.. 2030 లోగా 30 శాతం భూమి, సముద్రాన్ని రక్షించాలి అని. ఇందులో భారత్ కూడా సభ్య దేశమే.