న్యూఢిల్లీ : ఏపీలోని విశాఖపట్నంలో డిసెంబర్ 11 నుంచి 13 వరకు ఇండియా ఇంటర్నేషనల్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ ఇండియా ఇంటర్నేషనల్ హాస్పిటల్ నీడ్ ఎక్స్పో జరుగనుంది. భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా ఈ ఎక్స్పోను ఏర్పాటు చేశారు. ఇన్వెస్ట్ ఇండియా, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్, అసోసియేషన్ ఆఫ్ హెల్త్కేర్ ప్రొవైడర్స్ ఇండియా (AHPI), కన్సార్టియం ఆఫ్ అక్రెడిటెడ్ హెల్త్కేర్ ఆర్గనైజేషన్స్ (CAHO), అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీతో కలిసి ఎక్స్పోను నిర్వహిస్తున్నట్లు ఈవెంట్ కోఆర్డినేటర్ రాజీవ్ నాథ్ తెలిపారు.
కొవిడ్-19 మహమ్మారి సమయంలో ఎక్స్పో కీలకమైందిగా భావిస్తున్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్ మాన్యుఫ్యాక్చరర్స్ ఇండియా (ADMI), ఫోర్స్ బయోమెడికల్ అండ్ పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ గ్రూప్ పాల్గొంటోంది. ఈవెంట్ ద్వారా, ఆరోగ్య సంరక్షణ, ఆసుపత్రులకు అవసరమైన పరికరాల డిమాండ్, తయారీ.. నాణ్యతపై చర్చలు జరుగుతాయని, కొత్త డిమాండ్ ప్రకారం ఉత్పత్తిని కూడా పరిగణనలోకి తీసుకుంటారని భావిస్తున్నారు.
ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీ అసోసియేషన్, హిందుస్థాన్ సిరింజెస్ అండ్ మెడికల్ డివైజెస్ మేనేజింగ్ డైరెక్టర్, ఫోరమ్ కన్వీనర్ రాజీవ్నాథ్ మాట్లాడుతూ ఈ రంగాలకు చెందిన వాటాదారులందరూ ఎక్స్పోలో తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తారని అన్నారు. మేక్ ఇన్ ఇండియాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షను నెరవేర్చడానికి భారతీయ వైద్య పరికరాల తయారీదారులు ప్రయత్నించిన విధానాన్ని కార్యక్రమంలో ప్రదర్శించనున్నట్లు పేర్కొన్నారు.