న్యూఢిల్లీ : భారత్లో కొవిడ్-19 పరీక్షల సంఖ్య 50 కోట్ల మైలురాయికి చేరిందని ఐసీఎంఆర్ గురువారం వెల్లడించింది. ఆగస్ట్లో రోజూ సగటున 17 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించగా దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ 50 కోట్ల నమూనాలను పరీక్షించారని పేర్కొంది. భారత్ చివరి పది కోట్ల పరీక్షలను కేవలం 55 రోజుల్లోనే చేపట్టి ఈనెల 18న 50 కోట్ల పరీక్షల మార్క్ను చేరుకుందని ఐసీఎంఆర్ ఓ ప్రకటనలో వెల్లడించింది.
దేశమంతటా టెస్టింగ్ సదుపాయాలు, మౌలిక వసతులను పెంచడం ద్వారా ఐసీఎంఆర్ ఈ అరుదైన మైలురాయిని వేగంగా చేరుకోగలిగిందని తెలిపింది. అందుబాటైన ధరలో కరోనా టెస్టింగ్ కిట్ల లభ్యత పెంచడం, టెక్నాలజీ సాయంతో ముమ్మరంగా కరోనా పరీక్షలు నిర్వహించేందుకు వెసులుబాటు కలిగిందని పేర్కొంది.
కరోనా పరీక్షల పెంపుతో వైరస్ను ప్రాధమిక దశలోనే గుర్తించి రోగులను ఐసోలేట్ చేయడం, అవసరమైన వారికి సమర్ధవంతమైన చికిత్స అందించేందుకు ఉపకరించిందని ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ ప్రొఫెసర్ బలరాం భార్గవ పేర్కొన్నారు. అధిక పాజిటివిటీ రేటు నమోదైన ప్రాంతాల్లో కొవిడ్-19 నమూనాల మాస్ టెస్టింగ్ చేపట్టారని తెలిపారు.