న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని అధిగమించింది. దేశంలో కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైన 18 నెలల్లోనే 200 కోట్ల డోసుల మార్కును దాటింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియను 2021, జనవరి 16న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. కేవలం 277 రోజుల్లోనే 100 కోట్ల మందికి వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది. గతేడాది సెప్టెంబర్ 17న ఒక్కరోజులోనే 2.5 కోట్ల మందికి వ్యాక్సినేషన్ చేసి సరికొత్త రికార్డు సృష్టించింది.
అధికారిక గణాంకాల ప్రకారం ఇప్పటివరకు దేశ జనాభాలో 96 శాతం మంది వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకున్నారు. 87 శాతం మంది రెండు డోసులను వేయించుకున్నారు. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో తాజాగా కేంద్ర ఆరోగ్యశాఖ 75 రోజుల వ్యాక్సినేషన్ ప్రక్రియను చేపట్టింది. ఈసందర్భంగా 18 ఏండ్లు నిండిన వయోజనులకు ఉచితంగా బూస్టర్ డోస్ పంపిణీ చేస్తున్నది. కాగా, ప్రపంచవ్యాప్తంగా 62.1 శాతం మంది జనాభా పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే 8 శాతం జనాభా మాత్రమే కొవిడ్ ప్రికాషనరీ డోసు వేయించుకున్నారు.