న్యూఢిల్లీ, డిసెంబర్ 10: కేంద్రంలో నరేంద్ర మోదీని గద్దె దించే ప్రధాన లక్ష్యంతో కాంగ్రెస్, ఇతర విపక్ష పార్టీలతో ఏర్పడిన ఇండియా కూటమి తదుపరి సమావేశం ఈనెల 19న దేశ రాజధాని ఢిల్లీలో జరుగనుంది. ఇండియా కూటమి నాలుగో సమావేశం ఈ నెల 19, మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు ఢిల్లీలో జరుగుతుందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఎక్స్లో వెల్లడించారు. ప్రధాని మోదీని ఎదుర్కొనేందుకు ఐకమత్యమే ప్రధాన ఇతి వృత్తంగా ‘నేను కాదు.. మేము’ థీమ్తో పార్టీలు ముందుకు సాగుతాయని ఆయన చెప్పారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని సమర్థంగా ఎదుర్కోవడానికి ప్రత్యామ్నాయ వాస్తవిక అజెండాతో ముందుకు రావడం ఇప్పుడు విపక్షాల ముందున్న సవాలని ఆయన పేర్కొన్నారు. కాగా, ఈ సమావేశంలో వచ్చే ఎన్నికల్లో కూటమిలోని పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు, సంయుక్తంగా బహిరంగ సమావేశాల ఏర్పాటు, ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర ఓటమి తదితర అంశాలను చర్చించనున్నట్టు తెలిసింది.