వాషింగ్టన్: జీవాయుధాలను నిషేధించాలని భారత్ మరోసారి డిమాండ్ చేసింది. శుక్రవారం జరిగిన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సమావేశంలో ఈ అంశాన్ని మరోసారి ప్రస్తావించింది. ఉక్రెయిన్పై రష్యా యుద్ధానికి జీవాయుధాల అంశమే ప్రధాన ఆరోపణగా ఉన్నది. ఈ నేపథ్యంలో భారత్తోపాటు అమెరికా, రష్యా ఇతర దేశాలు ఈ అంశంపైనే ప్రధానంగా మాట్లాడాయి. భారత డిప్యూటీ శాశ్వత ప్రతినిధి ఆర్ రవీంద్ర, దేశం తరుఫున అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జీవాయుధాలకు సంబంధించి బీటీడబ్ల్యూసీని పూర్తి స్ఫూర్తితో, సమర్థవంతంగా అమలు చేయడం ముఖ్యమని అన్నారు. ఈ అంశానికి సంబంధించిన ఏ విషయమైనా కన్వెన్షన్ నిబంధనల ప్రకారం సంప్రదింపులు, సహకారం ద్వారా పరిష్కరించాలని భారత్ భావిస్తొందని చెప్పారు.
అలాగే ఉక్రెయిన్లో దిగజారుతున్న పరిస్థితిపై భారత్ ఆందోళన చెందుతోందని ఆర్ రవీంద్ర తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న తాజా దౌత్య చర్చలను స్వాగతిస్తున్నామని చెప్పారు. శత్రుత్వాన్ని తక్షణమే విరమించుకోవడం, చర్చలు, దౌత్య మార్గాన్ని శ్రద్ధగా అనుసరించడం మాత్రమే ముందున్న ఏకైక మార్గమని భారత్ విశ్వసిస్తోందని అన్నారు.
కాగా, అమెరికా సహాయంతో జీవాయుధ ల్యాబ్స్ను ఉక్రెయిన్ నిర్వహిస్తున్నదని రష్యా విదేశాంగ మంత్రి ఇటీవల ఆరోపించారు. దీనికి సంబంధించి తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్లో అమెరికా జీవాయుధ పరిశోధనలపై చర్చ కోసం ఐరాస భద్రతా మండలి అత్యవసర సమావేశానికి రష్యా పిలుపునిచ్చింది. అయితే ఈ సమావేశంలో రష్యా ప్రతినిధి చేసిన ఆరోపణలను అమెరికా ప్రతినిధి ఖండించారు.