న్యూఢిల్లీ: ఇండియా కూటమిపై ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. సనాతన ధర్మాన్ని(Sanatan Dharma) ఆ కూటమి అంతం చేయాలని భావిస్తోందన్నారు. సనాతన ధర్మంపై డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. డెంగ్యూ, మలేరియాతో ఆ ధర్మాన్ని పోల్చారాయన. అయితే ఆ వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. వివాదాస్పద వ్యాఖ్యలను అనేక మంది ఖండించారు. తాజాగా ప్రధాని మోదీ ఇవాళ ఓ మీటింగ్లో ఆ అంశాన్ని తన ప్రసంగంలో ప్రస్తావించారు. మధ్యప్రదేశ్లోని బినాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
#WATCH | Bina, Madhya Pradesh: Prime Minister Narendra Modi says “The people of this INDIA alliance want to erase that ‘Sanatana Dharma’ which gave inspiration to Swami Vivekananda and Lokmanya Tilak…This INDIA alliance wants to destroy ‘Sanatana Dharma’. Today they have openly… pic.twitter.com/wc0C2hBxtS
— ANI (@ANI) September 14, 2023
మహాత్మా గాంధీ, స్వామి వివేకానంద, లోకమాణ్య తిలక్ లాంటి వారికి సనాతన ధర్మమే ప్రేరణగా నిలిచిందని, అలాంటి ధర్మాన్ని ఇండియా కూటమి నాశనం చేయాలని భావిస్తోందని ఆరోపించారు. చాలా బహిరంగంగా ఇండియా కూటమి నేతలు సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తున్నారని, రాబోయే రోజుల్లో వాళ్లు ఆ దాడుల్ని పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా సనాతన ఆచారాన్ని పాటించేవాళ్లు , ఈ దేశాన్ని ప్రేమించేవాళ్లు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ హెచ్చరించారు. సనాతన ధర్మంపై వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నవారిని అడ్డుకోవాలన్నారు.
ఏ సనాతన విలువల్ని గాంధీజీ జీవితాంతం పాటించారో, భగవాన్ శ్రీరాముడు ఆయనకు ప్రేరణగా నిలిచారని, గాంధీజీ తన ఆఖరి శబ్ధాన్ని రామ్ అని పలికారని, అస్పృశ్యతకు వ్యతిరేకంగా గాంధీజీ ఆ సనాతన స్పూర్తితోనే పోరాటం చేశారని, అలాంటి సనాతన ధర్మాన్ని ఈ ఇండియా కూటమి సమాప్తం చేయాలని భావిస్తోందని మోదీ అన్నారు. స్వామీ వివేకానంద కూడా సనాతన ధర్మం నుంచే ప్రేరణ పొందినట్లు ప్రధాని తెలిపారు. ఆ ధర్మం ఆధారంగానే సమాజంలో ఉన్న విభిన్నతలపై ప్రజలను వివేకానంద జాగృతం చేశారన్నారు. గణేశుడి పూజను స్వాతంత్రోద్యమ ఆందోళనతో జోడించిన లోకమాణ్య తిలక్ కూడా సనాతన స్పూర్తితోనే ఆ ఉద్యమాన్ని నడిపారన్నారు. అలాంటి ధర్మాన్ని ఇండియా కూటమి దెబ్బతీయాలని చూస్తోందన్నారు.
సనాతన శక్తితోనే స్వాతంత్య్ర ఆందోళన సమయంలో.. ఉరికంబం ఎక్కిన వీరులు కూడా భారతమాత ఒడిలోనే మళ్లీ జన్మించాలని కోరుకున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. సనాతన సంస్కృతి సాధువు రవిదాస్కు ప్రతిబింబంగా నిలుస్తుందన్నారు. శబరి మాతను గుర్తుపట్టేది కూడా ఆ సనాతన సంస్కృతే అని ప్రధాని అన్నారు. మహర్షి వాల్మీకి కూడా సనాతన ధర్మాన్ని ఆచరించారన్నారు. ఆ ధర్మమే వేల సంవత్సరాల నుంచి భారత్ను ఒక్కటిగా నిలిపిందన్నారు. ఇండియా కూటమి పార్టీలు అంతా ఒక్కటే.. ఈ దేశాన్ని ముక్కలు ముక్కలుగా చేయాలని చూస్తున్నట్లు ఆయన ఆరోపించారు.