Independence Day 2023 | భారతదేశానికి పశ్చిమ దేశాలతో ప్రాచీన కాలం నుంచే వర్తక సంబంధాలు ఉన్నాయి. అయితే ఇవి ఎక్కువగా భూమార్గంలో సాగేవి. 1453లో ఒట్టొమాన్ టర్కులు ఆధునిక టర్కీని ఆక్రమించుకున్నారు. అలా భూభాగంలో ఉన్న వర్తక మార్గాల మీద తురుష్కుల నియంత్రణ ఏర్పడింది. దాంతో ఆసియా ముఖ్యంగా భారత్, ఐరోపా దేశాల మధ్య సరకుల రవాణాకు ఆటంకం ఎదురైంది. ఈ కారణంగా పోర్చుగల్, ఇంగ్లండ్, నెదర్లాండ్స్ తదితర దేశాలకు తూర్పు దేశాలకు సముద్ర మార్గాన్ని కనుక్కోవడం తప్పనిసరైంది. 1498లో పోర్చుగల్ నావికుడు వాస్కోడిగామా ఆఫ్రికా ఖండాన్ని చుట్టి, కేరళ రేవుపట్టణం కాలికట్ చేరుకున్నాడు. భారత్కు కొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్న తొలి ఐరోపా నావికుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అలా భారత్లో వర్తక స్థావరాలు నెలకొల్పిన తొలి ఐరోపావారు పోర్చుగీసులే. వాళ్లు చాలావరకు సముద్ర తీరం ఉన్న దక్షిణ భారతదేశంలోనే తమ కార్యకలాపాలను కేంద్రీకరించారు. దాంతో 16, 17 శతాబ్దాలలో ఉత్తర భారతదేశంలో ప్రబలంగా ఉన్న మొగల్ సామ్రాజ్యాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి తలెత్తలేదు.
1602లో, నెదర్లాండ్స్ నుంచి డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటైంది. ఇంగ్లండ్ వ్యాపారులు ఈస్ట్ ఇండియా కంపెనీని ఏర్పాటుచేశారు. మొగల్ చక్రవర్తి జహంగీర్ కెప్టెన్ హాకిన్స్కు సూరత్లో ఫ్యాక్టరీ (వర్తక స్థావరం) ఏర్పాటు చేసుకునేందుకు ఫర్మానా జారీచేశాడు. తర్వాత సర్ థామస్ రో దేశంలో అన్ని ప్రాంతాల్లో ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుమతులు పొందాడు. పోర్చుగీసులు కట్నం కింద బొంబాయిని బ్రిటిష్ వాళ్లకు అప్పగించారు. బ్రిటిష్ వాళ్లు మొదట్లో మద్రాసు నుంచి తమ వ్యాపార విస్తరణను ప్రారంభించారు. 1698లో జాబ్ చార్నాక్ కలకత్తాను స్థాపించాడు. అలా బొంబాయి, మద్రాసు, కలకత్తా ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన వ్యాపార కేంద్రాలుగా నిలిచిపోయాయి. తర్వాత బ్రిటిష్ వారి వర్తకానికి ఫ్రెంచి వారి రూపంలో తీవ్ర సవాలు ఎదురైంది. అయితే బ్రిటిష్ కంపెనీతో పోలిస్తే ఫ్రెంచి కంపెనీకి ప్రతిబంధకాలు ఎక్కువ. 1760లో వందవాసి యుద్ధంలో ఫ్రెంచి కంపెనీ ఓడిపోయింది. దాంతో భారత దేశంలో బ్రిటిష్ వారికి ఐరోపా దేశాల ముప్పు తొలగిపోయింది. వ్యాపార, రాజకీయ రంగాల్లో ఏకచ్ఛత్రాధిపత్యానికి ద్వారాలు తెరుచుకున్నాయి