గువాహటి: భగవద్గీత శ్లోకాన్ని తప్పుగా అనువదించి, సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసినందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ క్షమాపణ చెప్పారు. ఆయన ప్రతి రోజూ ఉదయం ఓ భగవద్గీత శ్లోకాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 668 శ్లోకాలను పోస్ట్ చేశారు. అయితే భగవద్గీతలోని 18వ అధ్యాయంలో ఉన్న 44వ శ్లోకానికి అర్థాన్ని తప్పుగా తన బృందం సభ్యులు అనువదించారని ఆయన తెలిపారు. ఈ పొరపాటును తాను గుర్తించిన వెంటనే దానిని సామాజిక మాధ్యమాల్లోని తన ఖాతాలన్నిటి నుంచి తొలగించినట్లు తెలిపారు. ఈ పోస్ట్ ఎవరినైనా బాధించి ఉంటే, తాను క్షమాపణ చెప్తున్నానని తెలిపారు.
ఆయన పోస్ట్లో ఏముందంటే…
వ్యవసాయం, గోవుల పెంపకం, వ్యాపారం వైశ్యులకు సహజ కర్తవ్యాలని, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులకు సేవ చేయడం శూద్రుల కర్తవ్యమని ఈ శ్లోకానికి అర్థం అని వివరించారు. వైశ్యులకు, శూద్రులకు సహజ విధులను భగవాన్ శ్రీకృష్ణుడు వివరించాడని తెలిపారు. అయితే ఆయన పోస్ట్ను ప్రతిపక్ష నేతలు తీవ్రంగా ఖండించారు. బీజేపీ మనువాద, తిరోగమన సిద్ధాంతాలను అనుసరిస్తున్నదని దుయ్యబట్టారు.