ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్కు చెందిన సుమారు 1000 కోట్ల ఆస్తులను ఆదాయపన్ను శాఖ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద ఉన్న నిర్మల్ టవర్తో పాటు అయిదు ప్రాపర్టీలను ఐటీ శాఖకు అటాచ్ చేసినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. గత నెలలో ఐటీశాఖ పవార్ బంధువుల ఇండ్లల్లో దాడులు చేసిన విషయం తెలిసిందే. పవార్ సిస్టర్స్ ఇండ్లల్లోనూ దాడులు జరిగాయి. ముంబైతో పాటు పుణె నగరాల్లో ఈ సోదాలు జరిగాయి. అజిత్ పవార్ బంధువు జగదీశ్ ఇంట్లో తనిఖీలు నిర్వహించారు.
బినామీ ప్రాపర్టీల లబ్ధిదారుల్లో అజిత్ పవార్, ఆయన కుటుంబం ఉన్నట్లు ఆదాయపన్ను శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అజిత్ ఫ్యామిలీపై యాంటీ బినామీ చట్టం కింద కేసు బుక్ చేశారు. అజిత్ తన ఆస్తులను న్యాయమైన పద్ధతిలో ఆర్జించలేదని ఐటీశాఖ చెప్పింది. అయితే తనకు లింకు ఉన్న అన్ని సంస్థలు క్రమ పద్ధతిలో పన్నులు చెల్లించినట్లు అజిత్ పవార్ చెప్పారు. ప్రతి ఏడాది పన్నులు చెల్లిస్తామని, ఆర్థిక మంత్రి అయినప్పటి నుంచి ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నాని, తనతో లింకున్న అన్ని కంపెనీలు పన్నులు చెల్లించినట్లు ఎన్సీపీ నేత అజిత్ గత నెలలో వెల్లడించారు.