Lok Sabha Elections | న్యూఢిల్లీ, ఏప్రిల్ 7: లోక్సభ ఎన్నికలు సమీపించిన వేళ మహిళా నేతలపై వ్యక్తిగత దూషణలు మరోసారి పెరిగాయి. ప్రత్యర్థులుగా నిలుస్తున్న మహిళా అభ్యర్థులను లక్ష్యంగా చేసుకొని సభ్యత మరిచి విమర్శిస్తున్నారు నాయకులు. అన్ని పార్టీల్లోనూ ఇలా నోటి దురుసు ప్రవర్తించే నేతలు కనిపిస్తున్నారు. నటి, ఎంపీ హేమమాలిని ఉద్దేశించి కాంగ్రెస్ నేత రణ్దీప్ సుర్జేవాలా ఇటీవల చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. గతంలో రోడ్ల గురించి చెప్తూ హేమమాలినిపై లాలూప్రసాద్ యాదవ్ చేసిన అసందర్భ వ్యాఖ్యలు కూడా దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీజేపీ నాయకురాలు, నటి కంగనా రనౌత్ను ఉద్దేశించి కాంగ్రెస్ నేతలు హెచ్ఎస్ అహిర్, సుప్రియా శ్రీనేథ్ చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి.
పెద్ద నాయకురాళ్లకూ తప్పలేదు
సోనియా గాంధీ, మాయావతి, మమతా బెనర్జీ, స్మృతి ఇరానీ, జయప్రద, ప్రియాంక గాంధీ వంటి మహిళా నేతలకు కూడా వ్యక్తిగత దూషణలు తప్పలేదు. గత ఎన్నికల్లో రాంపూర్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసిన జయప్రదను ఉద్దేశించి సమాజ్వాదీ పార్టీ నేత ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు ఈ దూషణల పర్వానికి పరాకాష్టగా నిలిచాయి. కేవలం ప్రత్యర్థులే కాకుండా సొంత పార్టీల్లోని పురుష నాయకుల నుంచి మహిళా నేతలు ఇలాంటివి ఎదుర్కొంటున్నారని మహిళా హక్కుల కార్యకర్త రంజనా కుమారి తెలిపారు.