ఇంకా కొన్ని గంటలే. యోగి నేతృత్వంలోని బీజేపీ పశ్చిమ పరీక్షను ఎదుర్కోబోతోంది. 13 మంది అత్యంత కీలకమైన మంత్రులు అగ్ని పరీక్షకు రెడీ అవుతున్నారు. గురువారం యూపీలో మొదటి దశ ఎన్నికలు జరగనున్నాయి. 11 జిల్లాలు.. 58 సీట్లలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 13 మంది మంత్రులు తాము గెలవడంతో పాటు పశ్చిమ యూపీని కమలం ఛత్రచ్ఛాయల్లోకి తీసుకురావడానికి శతధా ప్రయత్నాలు చేస్తున్నారు. 2017 లో గెలిచినట్లుగానే ఈ సారి కూడా పశ్చిమ యూపీని స్వీప్ చేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. 2017 లో బీజేపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 58 సీట్లుంటే.. 53 సీట్లలో పాగా వేసింది. అయితే ఈ సారి మాత్రం బీజేపీకి ఇది కష్టమైన పని అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
బీజేపీ… తిరిగి ఆ సీట్లలో గెలవడానికి ఆపసోపాలు పడుతోంది. ముఖ్య నేతలందర్నీ పశ్చిమ యూపీలో మోహరించింది. తమ తమ నియోజకవర్గాలతో పాటు పశ్చిమ యూపీలోని కొన్ని ప్రాంతాలను కూడా చూసుకోవాల్సిందేనని మంత్రులకు తేల్చి చెప్పింది అధిష్ఠానం. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ దేశంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. ఈ ఆందోళనల్లో పశ్చిమ యూపీకి చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వీరందరూ బీజేపీపై గుర్రుగా ఉన్నారు. వీరు వేసే చక్రబంధ వ్యూహంలో బీజేపీ ఓడిపోవచ్చని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీరితో పాటు ముస్లింలు, జాట్లు కూడా ఇక్కడే ఎక్కువగా వున్నారు.
ఈసారి పశ్చిమ యూపీలో బీజేపీని ఎలాగైనా దెబ్బ తీయాలని ప్రధాన ప్రతిపక్షం సమాజ్వాదీ కృత నిశ్చయంతో వుంది. దీనికోసం రాష్ట్రీయ లోక్దళ్ను కూడా తనతో కలుపుకుంది. వీరిద్దరూ అటు ముస్లింలను, ఇటు జాట్లను తమ వైపు తిప్పుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. రైతు ఉద్యమం కారణంగా రైతులు బీజేపీపై తీవ్ర వ్యతిరేకతతో వున్నారు. ఇక జాట్లు కూడా ఇదే తోవలో నడుస్తున్నారు. ఈ అంశాలతో పాటు అధిక ధరలు, నిరుద్యోగం, చెరుకు రైతుల సమస్యలు… ఇలా పలు అంశాలను బీజేపీ మెడకు చుట్టుకున్నాయి.
ఘటనా ఘటన సమర్థుల్ని రంగంలోకి దింపిన బీజేపీ
పశ్చిమ యూపీలో తమకు ఎదురుగాలి తథ్యమన్న నిర్ధారణకు వచ్చిన బీజేపీ అధిష్ఠానం జాగ్రత్తగా అడుగులు వేసింది. అభ్యర్థులను కూడా అతి జాగ్రత్తగా ఎంచుకుంది. సిట్టింగ్ మంత్రులకే రెండోసారి కూడా అవకాశం ఇచ్చింది. సురేశ్ రాణా, అనిల్ శర్మ, లక్ష్మినారాయణ చౌదరి, కపిల్ దేవ్ అగ్రవాల్, దినేశ్ ఖటీక్, ధర్మేశ్, సందీప్ సింగ్, అతుల్ గార్గ్, శ్రీకాంత్ శర్మ లాంటి వారిని బీజేపీ మళ్లీ బరిలోకి దింపింది. అయితే వీరందరూ పైన పేర్కొన్న అంశాలను తట్టుకొని, నిలబడతారా? లేదా? అన్నది ఫలితాల్లో తెలుస్తుంది.