ఉదయ్పూర్ : కాషాయ పార్టీ ప్రలోభాలకు తెరలేపుతోందని రాజ్యసభ ఎన్నికల నేపధ్యంలో రాజస్ధాన్ సీఎం అశోక్ గెహ్లోత్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. పెద్దల సభకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు అందరూ విజయం సాధిస్తారని, తమ ఎమ్మెల్యేలు ఐక్యంగా ఉన్నారని గెహ్లోత్ విశ్వాసం వ్యక్తం చేశారు. జూన్ 10న రాజస్దాన్లో నాలుగు రాజ్యసభ స్ధానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముగ్గురు అభ్యర్ధులను బరిలో దింపగా, బీజేపీ ఓ అభ్యర్ధిని రంగంలో దింపింది.
ఇక ఇండిపెండెంట్ అభ్యర్ధిగా మీడియా దిగ్గజం సుభాష్ చంద్ర పోటీ చేస్తుండటంతో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. మూడు స్ధానాల్లో తమ అభ్యర్ధులకు 126 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని సీఎం అశోక్ గెహ్లోత్ చెప్పారు. తమ ఎమ్మెల్యేలు ఏకతాటిపై ఉన్నారని, గతంలో రాజకీయ సంక్షోభం తలెత్తినప్పుడూ వారంతా ఒక్కటిగా నిలిచారని, ఇతే తమ బలమని ఆయన చెప్పుకొచ్చారు. 2020లో అప్పటి డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ నేతృత్వంలో తనపై జరిగిన తిరుగుబాటు ఉదంతాన్ని ప్రస్తావించారు.
తగినంత సంఖ్యాబలం లేకున్నా సుభాష్ చంద్ర అభ్యర్ధిత్వానికి బీజేపీ ఎందుకు మద్దతిస్తోందని ప్రశ్నించారు. మరోవైపు తనకు ఎనిమిది మంది పాలక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తారని సుభాష్ చంద్ర పేర్కొన్నారు. సుభాష్ చంద్రకు 30 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతుతో పాటు ముగ్గరు ఆర్ఎల్పీ ఎమ్మెల్యేల మద్దతు లభిస్తోంది. సుభాష్ చంద్ర గెలుపొందాలంటే మరో ఎనిమిది ఓట్లు అవసరమవుతాయి. ఇక కాంగ్రెస్ పార్టీ జూన్ 2న ఉదయ్పూర్లోని రిసార్ట్స్కు తరలించగా, బీజేపీ తమ ఎమ్మెల్యేలతో జైపూర్ శివార్లలోని రిసార్ట్స్లో క్యాంపు నిర్వహిస్తోంది.