కోల్కతా: వ్యాపారం చేసే సోదరుల కారు, మంచంలో 8 కోట్ల డబ్బు పోలీసులకు లభించింది. దీంతో ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఆచూకీ లేని బిజినెస్ బ్రదర్స్ కోసం వెతుకుతున్నారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. అన్నాదమ్ములైన శైలేష్ పాండే, అరవింద్ పాండేకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఈ నెల 14న భారీగా డబ్బులు బదిలీ అయినట్లు బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దీంతో శనివారం అర్ధరాత్రి ఆ ఇద్దరి నివాసాలపై పోలీసులు రైడ్ చేశారు. ఆ సోదరులకు చెందిన శిబ్పూర్ ప్రాంతంలోని అపార్ట్మెంట్లలో తనిఖీలు చేశారు. బయట నిలిపి ఉంచిన కారులో 2 కోట్ల డబ్బులు లభించాయి. అలాగే ఫ్లాట్స్ లోపల మంచం బాక్సుల్లో ఆరు కోట్ల డబ్బులున్నాయి. కోల్కతా పోలీసులు ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు.
కాగా, తనిఖీల సందర్భంగా వారి ఇళ్లలో ఎవరూ లేరని పోలీసులు తెలిపారు. శైలేష్ పాండే, అరవింద్ పాండే కోసం లుకౌట్ నోటీస్ జారీ చేసినట్లు చెప్పారు. వారికి చెందిన రెండు బ్యాంకు ఖాతాల్లో భారీగా జమ అయిన డబ్బులపై ఆరా తీస్తున్నట్లు పోలీస్ అధికారి వివరించారు. బ్యాంకు వ్యతిరేక కార్యకలాపాల కింద వారిద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.