Global Media on Modi | రేర్ షో ఆఫ్ వీక్నెస్ (Rare Show of Weakness), భారత రైతుల ముందు తల వంచిన మోదీ (Modi Bows to India’s Farmers).. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత న్యూయార్క్ టైమ్స్ రాసిన కథనానికి పెట్టిన శీర్షిక ఇది.
ఏడేండ్లుగా భారత రాజకీయాల్లో (dominated politics) ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ప్రధాని మోదీ.. హిందుత్వ జాతీయవాద ఎజెండాతో పాలన సాగిస్తున్నారు. విపక్షాలు బలహీనంగా ఉన్న నేపథ్యంలో విమర్శలపై మౌనం వహిస్తూ ముందుకెళుతున్న సమయంలో అకస్మాత్గా వెనుదిరగడంతో జాతీయ రాజకీయాల్లో ఆధిపత్యం కోల్పోయినట్లు కనిపిస్తున్నారని న్యూయార్క్ టైమ్స్ వార్తాకథనం ప్రచురించింది. యావత్ విదేశీ మీడియా.. మోదీ అకస్మిక ప్రకటనపై విమర్శలు గుప్పించింది.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న వారిలో మెజారిటీ పంజాబీలే. పంజాబీలకు ఆరాధ్య దైవం.. సిక్కుమత గురువు గురునానక్ జయంతి నాడే వివాదాస్పద చట్టాలను ఉపసంహరిస్తున్నట్లు మోదీ ప్రకటించడం గమనార్హం అని పేర్కొంది. 2024 లోక్సభ ఎన్నికలకు యూపీ కీలకం.. వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందడం ప్రధాని మోదీకి చాలా కీలకం అని వ్యాఖ్యలు చేశాయి అంతర్జాతీయ మీడియా సంస్థలు. పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలతోపాటు ఉత్తర భారతావనిలోని గ్రామీణ ప్రాంతాల్లో రైతుల నుంచి వ్యతిరేకత పెరుగుతుందన్న సందేహాలతోనే మోదీ వెనుకడుగు వేశారని పేర్కొన్నాయి.
వ్యవసాయ రంగంలో సంస్కరణలకు శ్రీకారం చుట్టేందుకు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను అకస్మికంగా ఉపసంహరిస్తున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడం మేజర్ యూటర్న్ అని బీబీసీ వ్యాఖ్యానించింది. అంతకుముందు ప్రధాని మోదీ మొదలు ఆయన క్యాబినెట్ సహచరులు వ్యవసాయ చట్టాలతో రైతులకు మేలు జరుగుతుందని, వాటిని రద్దు చేసే ప్రసక్తే లేదని వాదించారని గుర్తు చేసింది.
వ్యవసాయ రంగ సంస్కరణల నుంచి ప్రధాని మోదీ వెనుకడుగు వేశారని ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ రాయిటర్స్ వ్యాఖ్యానించింది. ఆయన శుక్రవారం చేసిన ఈ అకస్మిక ప్రకటన.. ఏడాదికి పైగా ఉద్యమిస్తున్న అన్నదాతలకు విజయాన్ని చేకూర్చిందని పేర్కొంది. వరి, గోధుమలు పండించే ఉత్తరప్రదేశ్, పంజాబ్ వంటి ముఖ్యమైన గ్రీన్ బెల్ట్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగులుతుందేమోనన్న అంచనా మధ్య పోరాట పటిమ గల పేరొందిన ప్రధాని నరేంద్రమోదీ.. తీసుకున్న నిర్ణయం సిగ్నిఫికెంట్ క్లైంబ్డౌన్ (significant climb-down) అని వ్యాఖ్యానించింది.
వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ప్రధాని మోదీ ఉపసంహరిస్తూ తీసుకున్న నిర్ణయం ఏడాదికి పైగా ఆందోళన చేస్తున్న భారతీయ రైతులకు భారీ విజయం అని గార్డియన్ పేర్కొన్నది.