న్యూఢిల్లీ: హిందువులకు మైనారిటీ హోదా కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. జాతీయ మైనారిటీల కమిషన్ చట్టం 1992లోని సెక్షన్ 2(సీ) ప్రకారం కేవలం ఆరు మతాలకు చెందిన ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు, సిక్కులు, జైనులను మైనారిటీలుగా ప్రకటించడాన్ని పిటిషనర్ సవాల్ చేశారు. జనాభా ప్రకారం జిల్లాల వారీగా మైనారిటీలను గుర్తించి, రాష్ట్రాల వారీగా ప్రజలకు ఆ హోదా కల్పించాలని విజ్ఞప్తి చేశారు. హిందూ ఆధ్యాత్మిక నేత దేవకినందన్ ఠాకూర్ ఈ మేరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
కాగా, సుప్రీంకోర్టు ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది అరవింద్ దాతర్ వాదనలు వినిపించారు. 1993 నోటిఫికేషన్ ప్రకారం ఆరు వర్గాలు (ముస్లింలు, క్రైస్తవులు, బౌద్ధులు, పార్సీలు, సిక్కులు, జైనులు) జాతీయ స్థాయిలో మైనారిటీలుగా ఉన్నాయని తెలిపారు. అయితే మైనారిటీలను రాష్ట్రాలే నోటిఫై చేయాలని అనేక కోర్టు తీర్పులు చెబుతున్నాయన్నారు. ‘హిందువులకు మైనారిటీ హోదా నిరాకరించడంపై మేం మాట్లాడుతున్నాం. హిందువులు మైనారిటీలు కాకూడదన్నట్లుగా నమ్ముతున్నారు’ అని అన్నారు.
ఈ వాదనపై న్యాయమూర్తి లలిత్ స్పందించారు. కశ్మీర్ లేదా మిజోరాంలో హిందువులకు మైనారిటీ హోదాను నిరాకరించినట్లుగా నిర్దిష్టమైన కేసులు ఉంటే మాత్రమే ఈ పిటిషన్ను తాము పరిశీలిస్తామని తెలిపారు. మైనారిటీ హోదాపై ఉన్న అన్ని వివాదాలను రాష్ట్రాల వారీగా కోర్టు పరిశీలించదని చెప్పారు. హిందువులకు మైనారిటీ హోదాను రాష్ట్రాలు తిరస్కరించినట్లుగా ‘కచ్చితమైన ఉదాహరణలు’ కావాలన్నారు. ఈ నేపథ్యంలో జనాభా ప్రకారం రాష్ట్రాల వారీగా మైనారిటీ హోదా వివరాలను రెండు వారాల్లో సమర్పించాలని పిటిషనర్ను సుప్రీంకోర్టు కోరింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
మరోవైపు హిందువులకు మైనారిటీ హోదాకు సంబంధించిన మరో కేసులో కేంద్ర ప్రభుత్వం ఇటీవల కోర్టుకు వివరణ ఇచ్చింది. మైనారిటీలను నోటిఫై చేసే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని తెలిపింది. అయితే రాష్ట్రాలు, ఇతర వాటాదారులతో చర్చించిన తర్వాత ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటామని కోర్టుకు చెప్పింది. కాగా, మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇటీవల ఒక ప్రకటన చేసింది. ఏదైనా మత వర్గాన్ని లేదా భాషా వర్గాన్ని మైనారిటీగా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించవచ్చని పేర్కొంది.