(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ) : సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీని ఓడించాలంటూ మహారాష్ట్ర పౌర హక్కుల కార్యకర్తలు పెద్దఎత్తున ‘జాగో మహారాష్ట్ర’ (జాగోర్ మహారాష్ట్ర) ఉద్యమాన్ని చేపట్టారు. కర్ణాటకలో చేపట్టిన ‘ఎడ్డెలు కర్ణాటక’(మేలుకో కర్ణాటక ) లాంటి ప్రజాచైతన్య కార్యక్రమాలకు మహారాష్ట్రలో కూడా శ్రీకారం చుట్టారు. 2024లో బీజేపీ మళ్ళీ అధికారంలోకొస్తే 70 ఏండ్లుగా సాగుతున్న విలువలతో కూడుకున్న మన ప్రజాస్వామ్య వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తమవుతుందని మహారాష్ట్ర ప్రాజెక్టుల బాధిత ప్రజల హక్కుల సంఘం నాయకుడు, సామాజిక కార్యకర్త భరత్ పాటంకర్ నొక్కి చెప్పారు.
కర్నాటకలో బిజేపీని గద్దె దించటానికి చేపట్టిన ఎడ్డెలు కర్నాటక ప్రచార ఉద్యమం గురించి ఆ ఉద్యమ నాయకుడు లోకేష్ నాయక్ డిజిటల్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సంచార తెగల సమస్యలపై హిరామన్ పవార్, బ్యాంకింగ్ రంగం ధ్వంసంపై ఉద్యోగుల సంఘం నాయకుడు దేవిదాస్ తుల్జాపుర్కర్, మైనార్టీల వేధింపులపై ముంబైకి చెందిన ఫిరోజ్ మిథిబోర్వాలా, మీడియాను నియంత్రిస్తున్న విధానాలపై ప్రముఖ సీనియర్ జర్నలిస్టు సునీల్ తాంబే, కొవిడ్ మహమ్మారి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యంపై డాక్టర్ అభయ్ శుక్లా, పెరుగుతున్న నిరుద్యోగంపై యువ కార్యకర్త శ్రీనివాస్ షిండే, పేద, మధ్య తరగతి ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై ఛత్రపతి శంభాజీనగర్ ర్యాగ్ పికర్స్ అసోసియేషన్ నాయకుడు అశాతై థోక్ , సోషల్ మీడియాపై సిద్ధేష్ కదమ్ బీజేపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నష్టాలను వివరించారు.