పాట్నా: బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఈ నెల 25న సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఆయనను ఆదేశించింది. అయితే సీబీఐ ఆయనను అరెస్ట్ చేయబోదని భరోసా ఇచ్చింది. లాండ్ ఫర్ జాబ్ కేసులో విచారణ కోసం ఢిల్లీలోని సీబీఐ కార్యాలయానికి హాజరుకావాలని సీబీఐ మూడుసార్లు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 28తోపాటు మార్చి 4, 11న సమన్లు జారీ చేసినప్పటికీ తేజస్వి యాదవ్ సీబీఐ ఎదుట హాజరుకాలేదు. దీంతో మంగళవారం మూడోసారి సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఇతర అధికారులపై ఆరోపణలు ఉన్న లాండ్ ఫర్ జాబ్ కేసులో తనకు సమన్లు ఇవ్వడంపై కోర్టులో సవాల్ చేశారు. తండ్రి లాలూ ప్రసాద్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు తాను మైనర్ అని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. అలాగే విచారణ కోసం ఢిల్లీకి పిలువడంపైనా అభ్యంతరం వ్యక్తం చేశారు.
కాగా, తేజస్వి యాదవ్ పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు గురువారం విచారణ జరిపింది. ఆయన తరుఫు న్యాయవాది మణిందర్ సింగ్ వాదనలు వినిపించారు. బీహార్లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, ఏప్రిల్ 5న అవి ముగుస్తాయని కోర్టుకు తెలిపారు. మంత్రి అయిన తేజస్వి యాదవ్ ఆ తర్వాత సీబీఐ విచారణకు హాజరవుతారని చెప్పారు. తేజస్వి యాదవ్ ఢిల్లీ నివాసంలో ఈడీ తనిఖీల సందర్భంగా గర్భవతి అయిన ఆయన భార్యను అధికారులు విచారణ పేరుతో పలు గంటలపాటు కూర్చోబెట్టారని, దీంతో ఆమె ఆరోగ్యం క్షిణించడంతో ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో తేజస్వి యాదవ్ ప్రస్తుతం వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సీబీఐ విచారణలో పాల్గొంటారని, ఏప్రిల్ 5 తర్వాత భౌతికంగా హాజరవుతారని వెల్లడించారు.
మరోవైపు లాండ్ ఫర్ జాబ్ కేసులో చార్జిషీట్ సిద్ధంగా ఉందని సీబీఐ తరుఫు న్యాయవాది ఢిల్లీ హైకోర్టుకు తెలిపారు. దీంతో తేజస్వి యాదవ్ హాజరుకావాల్సిందేనని, వారాంతరాల్లో రావచ్చని అన్నారు. కాగా, తన క్లయింట్ను సీబీఐ అరెస్ట్ చేసే అవకాశం ఉందని తేజస్వి యాదవ్ తరుఫు న్యాయవాది ఆందోళన వ్యక్తం చేశారు. అయితే తేజస్వి యాదవ్ను ఇప్పుడు అరెస్ట్ చేయబోమని సీబీఐ తరుఫు న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఈ నెల 25న సీబీఐ ఎదుట హాజరు కావాలని తేజస్వి యాదవ్కు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.