చండీగఢ్: బ్యాంకు గోడకు కన్నం వేసిన దొంగలు లాకర్లను పగులగొట్టారు. వాటిలో ఉన్న నగలు, డబ్బులు, విలువైన వస్తువులను చోరీ చేశారు. (Bank Theft ) సోమవారం బ్యాంకు తెరిచిన సిబ్బంది చోరీ జరిగినట్లు గ్రహించి షాక్ అయ్యారు. హర్యానాలోని అంబాలాలో ఈ సంఘటన జరిగింది. ఒక సహకార బ్యాంకులో దొంగలు పడ్డారు. గోడకు రంధ్రం చేసి బ్యాంకులోకి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్, సుత్తితో బ్యాంకులోని 32 లాకర్లను పగులగొట్టి తెరిచారు. ఆ లాకర్లలో ఉన్న బంగారు ఆభరణాలు, డబ్బు, విలువైన వస్తువులను దొంగిలించారు.
కాగా, సోమవారం బ్యాంకు తెరిచిన సిబ్బంది చోరీ జరిగినట్లు గ్రహించి షాక్ అయ్యారు. ఆ బ్యాంకు మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఆ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. లాకర్లను లూఠీ చేయడంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శనివారం, ఆదివారం బ్యాంకుకు సెలవు కావడంతో ఏదో ఒక రోజు ఈ చోరీ జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు.
మరోవైపు చోరీ అయిన 32 లాకర్లలోని బంగారు ఆభరణాలు, విలువైన వస్తువుల విలువ ఎంతో తెలియదని ఆ బ్యాంకు మేనేజర్ తెలిపారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కస్టమర్లు లబోదిబోమంటూ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. భద్రంగా ఉంటాయని భావించి బ్యాంకు లాకర్లలో దాచుకున్న బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు చోరీ కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని మేనేజర్ను డిమాండ్ చేశారు.