న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చెలరేగుతున్న చైనాకు చెక్ పెట్టేందుకు భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. తూర్పు లడఖ్లో చైనా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్న క్రమంలో దాని దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు అదే ప్రాంతంలో నూతన వైమానిక కేంద్రాన్ని నెలకొల్పాలని నిర్ణయించింది. న్యోమాలో న్యూ ఎయిర్ఫీల్డ్ నిర్మాణ పనులను చేపట్టేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది.
చైనా సరిహద్దు నుంచి 50 కిలోమీటరల్ లోపున కొత్త ఎయిర్పీల్డ్ రానుందని, దీన్ని అప్గ్రేడ్ చేసిన అనంతరం యుద్ధ విమానాలు, ట్రాన్స్పోర్ట్ ఎయిర్క్రాఫ్ట్ కార్యకలాపాలను సులభంగా చేపట్టవచ్చని రక్షణ మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించే ఈ ఎయిర్ఫీల్డ్ అందుబాటులోకి వస్తే భారత వైమానిక దళం ఎలాంటి విపత్తును ఎదుర్కొనేందుకైనా వేగంగా ప్రతిస్పందించే వెసులుబాటు కలుగుతుందని ఆ వర్గాలు తెలిపాయి.
2020లో చైనా దుందుడుకు చర్యలకు దిగినప్పటి నుంచి న్యోమా అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్ నుంచి హెలికాఫ్టర్లు, విమానాల పహారా అధికమైంది. ఈ ఎయిర్బేస్ అప్గ్రేడ్ అయితే సైనిక దళాలు, యుద్ధసామాగ్రిని త్వరగా చేరవేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఈ బేస్ నుంచి చైనా బోర్డర్లో మోహరించిన సైనికులకు సహకరించేందుకు ఐఏఎఫ్కు చెందిన చినూక్, అపాచీ హెలికాఫ్టర్లు నిరంతరం చక్కర్లు కొడుతుంటాయి.