న్యూఢిల్లీ: అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ(Aligarh Muslim University)కి మైనార్టీ హోదా కల్పించే కేసులో .. ఇవాళ సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం నాలుగు రకాల తీర్పులను వెలువరించింది. చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నాయకత్వంలోని ఏడుగురు ధర్మాసనం ఈ తీర్పుల గురించి తెలిపింది. ఏఎంయూ కేసులో నాలుగు రకాల అభిప్రాయాలు ఏర్పడ్డాయని, దీంట్లో మూడు రకాల వ్యతిరేక తీర్పులు ఉన్నట్లు సీజే చంద్రచూడ్ తెలిపారు. మెజారిటీ తీర్పు తనతో పాటు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జేబీ పర్దివాలా, మనోజ్ మిశ్రా రాసినట్లు సీజే వెల్లడించారు. జస్టిస్ సూర్యకాంత్, దీపాంకర్ దత్త, సతీశ్ చంద్ర శర్మలు సపరేట్ తీర్పులను ఇచ్చినట్లు జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు.
విద్యా సంస్థ నియంత్రణ, పరిపాలన విషయంలో పార్లమెంట్లో చట్టం చేసినా.. ఆ విద్యాసంస్థకు ఉన్న మైనార్టీ హోదాను రద్దు చేయరని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. పార్లమెంట్ చట్టంతో అలీఘడ్ ముస్లిం వర్సిటీ మైనార్టీ హోదా రద్దు అయినట్లు 1968లో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టిపారేస్తున్నట్లు సీజే చంద్రచూడ్ తెలిపారు. అడ్మినిస్ట్రేషన్లో మైనార్టీ సభ్యులు లేనంత మాత్రాన.. ఆ వర్సిటీ మైనార్టీ హోదా పోదు అని సుప్రీంకోర్టు చెప్పింది.