న్యూఢిల్లీ: తాను మోసగాడిని కాదని, నటి జాక్వెలిన్తో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నానని సుకేష్ చంద్రశేఖర్ తెలిపాడు. పలువురిని మోసగించి రూ.200 కోట్ల మేర మనీలాండరింగ్ కుంభకోణానికి పాల్పడిన మాస్టర్మైండ్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. అయితే తాను ఎలాంటి మోసానికి పాల్పడలేదని సుకేష్ వెల్లడించాడు. ఈ మేరకు అతడు ప్రకటించిన నోట్ను ఆయన తరుఫు న్యాయవాది అనంత్ మాలిక్ మీడియాకు విడుదల చేశారు.
తన నుంచి కోట్లలో డబ్బులు తీసుకున్న జైలు అధికారులపై దర్యాప్తు ఎందుకు చేయడంలేదని సుకేష్ అందులో ప్రశ్నించాడు. తనకు రూ.200 కోట్లు చెల్లించిన రాన్బాక్సీ మాజీ ప్రమోటర్ భార్య అదితి సింగ్పై విచారణ ఎందుకు జరుగడంలేదని నిలదీశాడు. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్తో సీరియస్ రిలేషన్షిప్లో ఉన్నట్లు అందులో పేర్కొన్నాడు. తనపై నమోదైన క్రిమినల్ కేసు వల్ల తమ మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధంపై ఎలాంటి ప్రభావం చూపదని అన్నాడు.
తనపై చాలా ఆరోపణలు చేస్తున్నారని, అయితే అవి నిరూపణ కాకుండా తనను మోసగాడిగా పేర్కొనడం చాలా తప్పని ఆ ప్రెస్ నోట్లో సుకేష్ పేర్కొన్నాడు. భారత్తోపాటు విదేశాల్లోని బహుళ కార్పొరేట్ సంస్థలతో తాను కార్పొరేట్ లాబీయిస్ట్గా పనిచేసినట్లు తెలిపాడు. పలు కార్పొరేట్ సంస్థలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసినట్లు చెప్పాడు. ఈ నేపథ్యంలో పలు రాజకీయ పార్టీలు, వివిధ వ్యాపార కుటుంబాలతో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని వెల్లడించాడు. తన ఆస్తులను ఈడీ సీజ్ చేయడంపై కోర్టును ఆశ్రయిస్తానని ఆశ్రయిస్తానని ఆ ప్రెస్ నోట్లో పేర్కొన్నాడు. కాగా, ఢిల్లీలోని రోహిణీ జైలులో ఉన్న తనను వేధింపులకు గురిచేస్తున్నట్లు సుకేష్ ఇటీవల ఆరోపించాడు.