న్యూఢిల్లీ : కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ బుధవారం గ్రీన్ హైడ్రోజన్ కారులో పార్లమెంట్కు చేరుకున్నారు. గడ్కరీ తన నివాసం నుంచి పార్లమెంట్కు ఈ కారులో ప్రయాణించారు. భారత్లో భవిష్యత్ హైడ్రోజన్ కార్లదేనని గడ్కరీ స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ సైతం భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా ఈ తరహా వాహనాలు భారీ ముందడుగుగా అభివర్ణించారని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలపై భారమే కాకుండా కాలుష్యకారకమని గడ్కరీ అన్నారు. హైడ్రో ఇంధన సెల్ కార్లతో కాలుష్యం ఉండదని ఆయన వివరించారు. మూడు రకాల హైడ్రోజన్ కార్లున్నాయని, ఇది గ్రీన్ హైడ్రోజన్ అని ఈ ఇంధనం ధర కిలోమీటర్కు రూ 1.5 ఉంటుందని చెప్పారు.
దీని జపాన్ పేరు మిరై అని చెప్పుకొచ్చిన గడ్కరీ భవిష్యత్ ఈ వాహనాలదే అని కొనియాడారు. మంత్రి ఇటీవల భారత్లో తొలి హైడ్రోజన్ ఆధారిత అడ్వాన్స్డ్ ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్ టయోటా మిరైని ప్రారంభించారు. భారత్ ఇంధన స్వయం సమృద్ధిని సాధించే దిశగా సామర్ధ్యం, ఎకోఫ్రెండ్లీ, సస్టెయినబుల్ ఎనర్జీగా గ్రీన్ హైడ్రోజన్ ముందుకొచ్చిందని గడ్కరీ పేర్కొన్నారు.