Consultancy | న్యూఢిల్లీ, నవంబర్ 11: కేంద్రం ప్రతి చిన్నా, పెద్దా పనికి కన్సల్టెన్సీలపైనే ఆధారపడుతున్నది. ఏటా వాటికి వందలాది కోట్ల రూపాయలను ఫీజుగా సమర్పించుకుంటున్నది. ‘ద ఇండియన్ ఎక్స్ప్రెస్’ సమాచార హక్కు చట్టం ద్వారా దీనికి సంబంధించిన ముఖ్య సమాచారాన్ని సేకరించింది. దీని ప్రకారం 2017 ఏప్రిల్ నుంచి 2022 జూన్ వరకు ప్రైస్ వాటర్ కాపర్స్ (పీడబ్ల్యూసీ), డెలాయిట్ టచ్ తోమట్స్ లిమిటెడ్, ఎర్నెస్ట్ అండ్ యంగ్ గ్లోబర్ లిమిటెడ్, కేపీజీఎం ఇంటర్నేషనల్ లిమిటెడ్, యూఎస్ కేంద్రంగా ఉన్న మెక్కిన్సీ అండ్ కంపెనీ అనే నాలుగు సంస్థలకు రూ.500 కోట్ల విలువైన 300 అసైన్మెంట్లను కేంద్రం అప్పగించింది. వీరికి ఈ ప్రాజెక్టులను అప్పగించిన వారిలో ప్రభుత్వ మంత్రిత్వ శాఖలతో పాటు వివిధ ప్రభుత్వ విభాగాలు ఉన్నాయి. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులు ఉన్నత స్థానాల్లో ఉన్న ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, కోల్ ఇండియా, పౌర విమానయాన శాఖ, ఫారెస్ట్, ైక్లెమేట్ ఛేంజ్, టూరిజం, రోడ్ ట్రాన్స్పోర్టు అండ్ హైవేస్ ఇలా పలు శాఖలు, సంస్థలు నిత్యం వీటికి ప్రాజెక్టులు అప్పగిస్తూనే ఉన్నాయి.
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక 2015 నుంచి ఈ కన్సల్టెన్సీల సంస్కృతి బాగా పెరిగింది. మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ పథకాలు రూపకల్పన అంతా ఈ కన్సల్టెన్సీల ద్వారానే జరిగింది. ఈ కన్సల్టెన్సీ ప్రతినిధులు అన్ని శాఖలు, సంస్థలతో నిత్యం సత్సంబంధాలు కలిగి ఉంటారు. ప్రతి ప్రాజెక్టులోనూ తమ భాగస్వామ్యం ఉండేలా వీరు ఉన్నత స్థాయిలో మేనేజ్ చేస్తుంటారు. డిజిటలైజేషన్, ఆధునిక సాంకేతికత విషయంలో వీరు ఎప్పటికప్పుడు అప్డేట్ కావడం, ఈ విషయంలో ప్రభుత్వ సంస్థలు వెనుకబడి ఉండటంతో వీటిపై ఆధారపడక తప్పడం లేదని ఒక ఉన్నతాధికారి తెలిపారు.