Pak | పొద్దున లేస్తే.. అప్పు ఎవడిస్తాడా? అని ఎదురు చూపులు.. ఆర్థిక వ్యవస్థ గింగిరాలు తిరిగిపోతోంది. ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ద్రవ్బోల్బణం పెరిగిపోతోంది. ఆర్థిక సవాళ్లు మెడకు చుట్టుకొని ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. ధనాన్ని ఎలా పుట్టించాలో కూడా అర్థం కాలేనంత అధః పాతాళానికి పడిపోయారు. అయినా పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పలికే బీరాలకు మాత్రం కొదువే లేదు. భారత్ను ఇరికించడానికి అప్పు ఇస్తానని చైనా అంటోందే తప్ప… ఇస్తుందో ఇవ్వదో తెలియదు. అప్పు కోసం పాక్ ప్రధాని ఇమ్రాన్ వచ్చే నెల బీజింగ్ వెళ్తున్నారు. మరి చైనా ఇస్తుందా? ఇవ్వదా? క్లారిటీ లేదు. మిగతా ప్రపంచ దేశాలైతే… నీ దారి నువ్వు చూసుకో అంటూ అప్పులివ్వడానికి కూడా మొహం చాటేస్తున్నాయి.
చివరికి ప్రపంచ బ్యాంకు దయతలచి, 195 మిలియన్ డాలర్లను పాక్కు అప్పుగా ఇచ్చింది. అది కూడా చీకటిలో అలమటించకుండా, విద్యుత్ రంగాన్ని బాగు చేసుకోవాలన్న షరతుతో ఆ అప్పు ఇచ్చింది. మరో వైపు ఆయా దేశాల్లో పాక్ తరపున ఉన్న రాయబారులకు జీతాలు కూడా ఇచ్చుకోలేని దుస్థితి. ఒక్కొక్కరుగా రాజీనామాలు చేసేస్తున్నారు… ఇంత ఘనమైన చరిత్ర పెట్టుకొని, ఇవన్నీ మరిచిపోయి, పాక్ ప్రధాని బీరాలు పలుకుతున్నారు. పారిశ్రామిక వేత్తలను బురిడీ కొట్టిస్తున్నారు. తన తప్పుడు లెక్కలతో ఏకంగా పారిశ్రామిక వేత్తలపైనే మంత్రాక్షతలు చల్లేస్తున్నారు. భారత్ కంటే పాక్ ఆర్థిక వ్యవస్థే బాగుందంటూ తెగ గొప్పకు పోయారు. ఇతర దేశాల నుంచి అప్పులు తీసుకోవడం వల్లే బతికి బట్టకట్టామని, లేదంటే దివాలాయే గతి అని ఇమ్రాన్ ఖానే వ్యాఖ్యానించి… ఆ ఒక్క నిమిషంలోనే నాలుక తిప్పేసి.. భారత్ కంటే పాక్ ఆర్థిక వ్యవస్థే బహు బాగున్నదని అనేస్తే.. ఎమనాలి? ఇంకా ఇమ్రాన్ ఖాన్ ఏమన్నారో చూడండి…..
కరోనా అంతటి క్లిష్ట సమయంలో కూడా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉందని, భారత ఆర్థిక వ్యవస్థ కంటే పాకిస్తాన్దే మెరుగ్గా ఉందని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానిస్తున్నారు. కరోనాను భారత్ కంటే తామే సులువుగా ఎదుర్కోగలిగామని కూడా గొప్పలు చెపుకున్నారు. కరోనా సమయంలో భారత్ వృద్ధిరేటు కిందికి పడిపోయిందని, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ మాత్రం అంతే పటిష్టంగా ఉందని అంటున్నారు. పెట్రో, డీజిల్ ధరలు కూడా పాక్లో తక్కువగానే ఉన్నాయని, అదే భారత్లో ఎలా ఉన్నాయో ఓ సారి గమనించాలని పారిశ్రామిక వేత్తలకే చెబుతున్నారు. రావల్పిండి వేదికగా జరిగిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఆర్సీసీఐ) సమావేశంలో ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘కోవిడ్ లాంటి క్లిష్ట సమయంలోనూ పాక్ ఎలా బయటపడిందో మీకు తెలుసు. అల్లా దయ వల్ల ఎలా బయటపడగలిగామన్నది ప్రపంచం మొత్తం చూసింది. ప్రపంచం మొత్తానికీ తెలుసు. ప్రపంచం మనల్ని చూసి తెగ ముచ్చటపడింది. మెచ్చుకుంది. మన ఆర్థిక వ్యవస్థను కూడా మనం కాపాడుకున్నాం. మన ప్రజల ప్రాణాలు కూడా కాపాడుకోగలిగాం. కరోనా కారణంగా ప్రపంచం ఎలా విధ్వంసమైందో మీకు తెలుసు కదా. మన కంటే భారత్ వృద్ధి రేటు ఎంత ఎక్కువగా వుందో మీకు తెలుసు కదా. కానీ.. కరోనా కాలంలో వాళ్ల వృద్ధి రేటు అమాంతం కిందికి పడిపోయింది. భారత్లో కరోనా మరణాలు కూడా అధికమే. మనకు పక్కా లెక్కలు తెలియవు గానీ.. కొందరు 10 లక్షలు అంటున్నారు. మరి కొందరు 30 లక్షలు మరణించారని అంటున్నారు. కానీ ఇక్కడ అల్లా ఎంత మేలు చేశాడో తెలుసు కదా’ అంటూ ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.
ప్రపంచ మంతా కరోనాతో అల్లాడిపోతున్న వేళ… పాకిస్తాన్లో లాక్డౌన్ విధించాలని కొందరు తనపై తెగ ఒత్తిడి తెచ్చారని, అయినా తాను వినలేదని, లాక్డౌన్ విధించలేదని ఇమ్రాన్ పేర్కొన్నారు. లాక్డౌన్ విధించని కారణంగానే పాక్ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టంగా ఉందని వివరించారు. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ కూడా తాను చెప్పినట్టే నడుచుకుంటున్నారని, తాను సూచించిన వాటినే అమలుపరుస్తున్నారని కూడా ఇమ్రాన్ పెద్దరికపు మాటలు మాట్లాడారు.
ఇన్ని గొప్పలు చెబుకున్నా… చివరికి అప్పుల వద్దకే వచ్చారు ఇమ్రాన్. ఇతర దేశాల నుంచి అప్పులు తీసుకోవడం వల్లే బతికామని, లేదంటే ఎప్పుడో దివాలా తీసేవారని మెళ్లిగా చెప్పారు. సౌదీ అరేబియా, చైనా అలాగే యూఏఈ ద్వారా తీసుకున్న అప్పులే పాక్ దివాలా తీయకుండా కాపాడాయని అన్నారు. పాక్ గనక ఎగుమతులను పెంచుకోకుంటే మరోసారి ఐఎంఫ్ దగ్గర అప్పు చేయాల్సి వుంటుందని కూడా ఇమ్రాన్ ఖానే వ్యాఖ్యానించారు.
భారత ఆర్థిక వ్యవస్థ కంటే పాక్ ఆర్థిక వ్యవస్థే పరిపుష్టంగా ఉందన్న పాక్ ప్రధాని ఇమ్రాన్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఘాటుగా స్పందించారు. అవును… ఎందుకంటే మీ దగ్గర సిద్దూ ఉన్నాడు. మా దగ్గర కేవలం త్వరితగతిన ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉంది. ఎక్కువగా యూనికార్న్ కంపెనీలున్నాయి. ఎక్కువగా ఎఫ్డీఐలు కూడా ఉన్నాయి అంటూ కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కౌంటర్ ఇచ్చారు.
ఇక కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వి కూడా అంతే ఘాటుగా స్పందించారు. మీరు సౌదీ నుంచి అప్పులు తెచ్చుకుంటారు. మీ భూములను, మీ వనరులను వేలం వేస్తారు. బతకడానికి గాడిదలను అమ్ముకోండి అంటూ అభిషేక్ సింఘ్వీ ఘాటుగా ట్వీట్ చేశారు.