న్యూఢిల్లీ : వాయు కాలుష్యం నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. కాలుష్యాన్ని వెదలజల్లే వాహనాలపై తాత్కాలికంగా నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. బీఎస్-3 పెట్రోల్, బీఎస్-4 డీజిల్ కార్లపై నిషేధం విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. మంగళవారం నుంచి శుక్రవారం వరకు వాహనాలపై నిషేధం కొనసాగుతుందని చెప్పారు. గత రెండు రోజులుగా ఢిల్లీలో చలితీవ్రత పెరుగుతున్నది. చలికి తోడు భారీగా పొగమంచు పేరుకుపోతున్నది.
ఫలితంగా వాయు కాలుష్యంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ పరిస్థితుల్లో.. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అలాగే ఎన్సీఆర్ పరిధిలోని రాష్ట్రాల్లో పంట వ్యర్థలు కాల్చకుండా చర్యలు తీసుకోవాలని ఆయా రాష్ట్రాలను అధికారులు కోరారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలకు పడిపోయాయి. చలిగాలులతో పాటు పొగమంచు కారణంగా గాలి నాణ్యత తగ్గుతోందని అధికారులు పేర్కొన్నారు. వాయు కాలుష్యం మెరుగుపడితే ముందుగానే ఆంక్షలు సడలించనున్నట్లు పేర్కొన్నారు.