న్యూఢిల్లీ, జూలై 22: ఓ నేరానికి సంబంధించిన కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నిందితుడు నేరానికి పాల్పడినట్టు నిర్ధారించేందుకు.. ప్రత్యక్ష సాక్షులు ఎవరూ లేని పక్షంలో, ఆ నేరం చేసేందుకు నిందితుడికి ఉన్న ఉద్దేశం, ప్రేరణను దర్యాప్తు అధికారులు నిరూపించాల్సి ఉంటుందని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ అమనుల్లా ధర్మాసనం పేర్కొన్నది. ఒక నేర ఘటనను ఎవరూ ప్రత్యక్షంగా చూడని నేపథ్యంలో.. ఉద్దేశం(మోటివ్) అనేది కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడింది. 2008 నాటి హత్య కేసులో చత్తీస్గఢ్ హైకోర్టు విధించిన జీవిత ఖైదు శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. ఈ కేసులో అతన్ని నిర్దోషిగా ప్రకటిస్తూ న్యాయస్థానం తాజాగా తీర్పునిచ్చింది.