న్యూఢిల్లీ, సెప్టెంబర్ 5: కేంద్రం తీసుకొస్తున్న కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వస్తే కీలక మార్పులు రానున్నాయి. ఏడాదిలో ఉద్యోగి వాడుకోని ఆర్జిత సెలవులు 30 దాటితే.. ఆ సెలవులకు కంపెనీ వేతనం చెల్లించాల్సి ఉంటుంది. వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితులకు సంబంధించిన చట్టం ప్రకారం ఒక ఉద్యోగి కేలండర్ సంవత్సరంలో గరిష్ఠంగా 30 రోజుల పాటు వేతనంతో కూడిన సెలవులను దాచుకోవచ్చు. వీటి సంఖ్య 30 దాటితే వాటికి వేతనం చెల్లించాలి. ఈ దాచుకున్న 30 రోజుల సెలవులను ఉద్యోగి మరుసటి ఏడాదికి మళ్లించవచ్చు.
ఈ కొత్త చట్టం ప్రకారం అదనపు సెలవులను ఉద్యోగి నష్టపోయే అవకాశం ఉండదు. ఆ సెలవులకు యాజమాన్యం వేతనం చెల్లించాల్సిందే. ఈ చెల్లింపు ఆ ఏడాది చివరన చేయవచ్చు. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం చాలా యాజమాన్యాలు వార్షిక ప్రాతిపదికన ‘లీవ్ ఎన్కేష్మెంట్’ సౌకర్యానికి అనుమతించడం లేదు. అంతేకాకుండా పెయిడ్ లీవ్ బ్యాలెన్స్ ఎక్కువైతే అవి రద్దవుతున్నాయే తప్ప దానిని తదుపరి ఏడాదికి మళ్లించేందుకు అనుమతించడం లేదు.