న్యూఢిల్లీ : ఐఎంఏ, రాందేవ్ బాబాల మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. అల్లోపతి, ఆధునిక వైద్యంపై యోగ గురు చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపగా రాందేవ్ పై కఠిన చర్యలు చేపట్టాలని ఐఎంఏ డిమాండ్ చేసింది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం అందించే కొవిడ్-19 కిట్ లో కరోనిల్ ఔషధం చేర్చాలన్న పతంజలి ప్రతిపాదనను ఐఎంఏ వ్యతిరేకించింది.
కరోనిల్ టాబ్లెట్ కు అంతర్జాతయ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఏ)ఆమోదం లేదని, కేంద్ర మార్గదర్శకాల్లోనూ కరోనిల్ ను ప్రస్తావించలేదని ఐఎంఏ ఉత్తరాఖండ్ విభాగం పేర్కొంది. అల్లోపతి మందులతో పాటు కరోనిల్ టాబ్లెట్ ను కలపడం ఆయుర్వేద, అల్లోపతిని కలిపి వాడినట్టు అవుతుందని, ఇది సుప్రీం కోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఐఎంఏ ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి రాసిన లేఖలో స్పష్టం చేసింది. రాందేవ్ కరోనిల్ కు డబ్ల్యూహెచ్ఓ ఆమోదం లభించలేదు.
మూడు ఆయుర్వేద మందులతో కూడిన కరోనిల్ కిట్ ను రాందేవ్ బాబా కొద్దినెలల కిందట లాంఛ్ చేసిన సంగతి తెలిసిందే. కొవిడ్-19కి కరోనిల్ ఆయుర్వేద చికిత్సగా ఉపకరిస్తుందని రాందేవ్ చెప్పుకొచ్చారు. ఈ ఔషధం పనితీరు వెల్లడయ్యే వరకూ దీనిపై ప్రచారం నిలిపివేయాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ రాందేవ్ ను కోరింది. మరోవైపు కరోనిల్ కిట్ పై తప్పుడు ప్రచారం మానుకోవాలని రాందేవ్ కు ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ పిటిషన్ ఆధారంగా హైకోర్టు స్పందించింది.