చండీగఢ్: వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రకాశ్ పర్వదనం పూట ప్రధాని వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారని, రైతులకు క్షమాపణలు చెప్పారని అన్నారు. ఇంతకంటే పెద్ద విషయం ఇంకేమీ ఉండదని పేర్కొన్నారు. ఎట్టకేలకు రైతులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ప్రధానికి, హోంమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుతం ప్రధాని రైతులకు క్షమాపణ చెప్పారని, ఇక పార్లమెంట్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయడమే మిగిలిందని అమరీందర్ చెప్పారు. ఈ నెల 29న పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతాయని, ఈ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో సమస్య పరిస్కారం అయినట్లేనని వ్యాఖ్యానించారు. ప్రధాని స్పష్టంగా ప్రకటన చేసిన తర్వాత కూడా రైతులు ఆందోళన కొనసాగిస్తామనడంలో అర్థం లేదన్నారు. రైతుల సమస్య పరిష్కారం తర్వాతే బీజేపీతో సీట్ల సర్దుబాటుపై నిర్ణయం తీసుకుంటానని గత మూడు నెలల నుంచి చెబుతూ వచ్చానని ఆయన గుర్తుచేశారు.