ముంబై: ప్రధాని మోదీ మంత్రివర్గంలో చేరాలంటూ తనకు ఎలాంటి ఆఫర్ రాలేదని మహారాష్ట్రకు చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) తెలిపారు. దీని గురించి వినిపిస్తున్నవన్నీ వదంతులేనని కొట్టిపారేశారు. ఎన్సీపీలో తిరుగుబాటు చేసి డిప్యూటీ సీఎం పదవిని చేపట్టిన అజిత్ పవార్, శరద్ పవార్ ఆగస్ట్ 12న పూణెలోని ఒక వ్యాపారవేత్త నివాసంలో రహస్యంగా కలుసుకున్నారు. సుమారు ఐదు గంటలపాటు వారిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’కు శరద్ పవర్ దూరంగా ఉండాలని, బీజేపీతో కలువాలని, కేంద్ర మంత్రివర్గంలో చేరాలని శరద్ పవార్కు అజిత్ పవార్ సూచించినట్లుగా వార్తలొచ్చాయి.
కాగా, మహారాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత పృథ్వీరాజ్ చవాన్ కూడా దీని గురించి ప్రస్తావించారు. శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య జరిగిన రహస్య భేటీ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ పదవి కోసం శరద్ పవార్కు ఆఫర్ వచ్చినట్లుగా తనకు తెలిసిందన్నారు. ప్రతిపక్షాల కూటమి ‘ఇండియా’ మూడో సమావేశం ముంబైలో జరుగనుండటంతో శరద్ పవార్ దీనిపై స్పష్టత ఇవ్వాలని ఆయన కోరారు.
మరోవైపు తన గురించి వస్తున్న వదంతులపై శరద్ పవార్ బుధవారం స్పందించారు. బీజేపీలో చేరాలని కొందరు తనను బుజ్జగిస్తున్నట్లు తెలిపారు. అయితే తన పార్టీ బీజేపీలో చేరదని అన్నారు. ఎన్సీపీ రాజకీయ విధానానికి ఇది విరుద్ధమని చెప్పారు. పార్టీలో తాను సీనియర్ అన్న శరద్ పవార్, కేంద్ర మంత్రివర్గంలో చేరాలన్న ప్రతిపాదన ఎవరూ చేయలేదని స్పష్టం చేశారు.
కాగా, ఎన్సీపీ గుర్తింపు, ఆ పార్టీ గుర్తుపై వివరణ కోసం శరద్ పవార్, అజిత్ పవార్ వర్గాలకు కేంద్ర ఎన్నికల సంఘం మరో మూడు వారాలు గడువు ఇచ్చింది. సెప్టెంబర్ 8లోగా తన నోటీస్కు సమాధానం ఇవ్వాలని రెండు వర్గాలను బుధవారం కోరింది. ఆగస్ట్ 17లోగా సమాధానం ఇవ్వాలంటూ జూలై 27న ఇరువర్గాలకు ఈసీ లేఖలు రాసింది. తాజాగా ఆ గడువును సెప్టెంబర్ 8 వరకు పొడిగించింది. ఎన్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల అఫిడవిట్లతోపాటు అజిత్ పవార్ను ఎన్సీపీ చీఫ్గా ఎన్నుకుంటూ రెబల్ వర్గం చేసిన తీర్మానం కూడా ఈసీ వద్దకు చేరాయి. వీటిని పరిశీలిస్తున్న ఈసీ, ఇరు వర్గాల వివరణ కోరింది.