Rahul @ Matha Vaishno | కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ తాను కశ్మీర్ పండిట్ను అని పేర్కొన్నారు. శుక్రవారం ఆయన జమ్ములోని మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. జై మాతా దీ అన్న నినాదాల మధ్య వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించిన రాహుల్.. తానూ జై మాతా దీ అని నినాదాలు చేశారు.
నేను కశ్మీర్ పండిట్ను. మా కుటుంబం కశ్మీరీ పండిట్ కుటుంబం. నన్ను కశ్మీరీ పండిట్ల ప్రతినిధి బృందం కలుసుకుంది. కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో పలు సంక్షేమ పథకాలు అమలయ్యాయి. బీజేపీ హయాంలో జరిగిందేమీ లేదని ఆ బృందం వివరించింది అని రాహుల్ గాంధీ అన్నారు.
ఈ సందర్భంగా జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలోనూ జై మాతా దీ అని నినాదాలిచ్చారు.. కానీ శ్రేణుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో కాసింత గట్టిగా బోలియో.. బోలియే (చెప్పండి.. చెప్పండి) అని నినాదాలు చేశారు. రెండు రోజుల పాటు జరిగిన ఈ పర్యటనలో గురువారం కత్రా నుంచి కాలి నడకన వైష్ణోదేవి ఆలయానికి బయలుదేరారు.
మాతా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చిన తాను రాజకీయ వ్యాఖ్యలు చేయబోనని చెప్పారు. చివరికి మీడియా ఫొటోగ్రాఫ్లు తీసుకోవడానికి కూడా అనుమతించలేదు. అయితే, యాత్రికులతో కలిసి ఆయన ముచ్చటిస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
మరోవైపు రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ తప్పుబట్టింది. ఇది ఆయన అపరిపక్వతకు నిదర్శనం అని పేర్కొంది. రాహుల్ అవకాశ వాద రాజకీయాలు చేస్తున్నారని వ్యాఖ్యానించింది.