న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, ఆయన అనుచరుడి నివాసాల్లో ఏసీబీ సోదా చేసింది. రూ.12 లక్షల నగదు, లైసెన్స్ లేని ఒక పిస్టల్ను స్వాధీనం చేసుకుంది. రెండేళ్ల కిందట ఢిల్లీ వక్ఫ్ బోర్డులో జరిగిన అక్రమ నియామకాలపై ఢిల్లీ పోలీస్ విభాగానికి చెందిన అవినీతి నిరోధక శాఖ దర్యాప్తు జరుపుతున్నది. ఇందులో భాగంగా ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్, ఆయన వ్యాపార భాగస్వామి హమీద్ అలీ ఖాన్ మసూద్ ఉస్మాన్ నివాసాల్లో ఢిల్లీ పోలీసులు శుక్రవారం రైడ్ చేశారు. రూ.12 లక్షల డబ్బు, డబ్బులు లెక్కించే యంత్రం, అక్రమంగా కలిగి ఉన్న ఒక పిస్టల్, నాలుగు బులెట్లను ఎమ్మెల్యే అనుచరుడు హమీద్ అలీ ఖాన్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్నారు.
కాగా, ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ను ఏసీబీ అధికారులు శుక్రవారం ప్రశ్నించారు. 2020లో ఢిల్లీ వక్ఫ్ బోర్డులో జరిగిన అక్రమ నియామకాలపై ఆరా తీశారు. దర్యాప్తు కోసం శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తమ కార్యాలయానికి రావాలంటూ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్కు సమన్లు కూడా ఏసీబీ ఇటీవల జారీ చేసింది.
మరోవైపు ఓఖ్లా ఎమ్మెల్యే అయిన అమానతుల్లా ఖాన్ ఢిల్లీ వక్ఫ్ బోర్డు ఛైర్మన్గా ఉన్నారు. ఏసీబీ సమన్లు జారీ చేసిన విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. కొత్త వక్ఫ్ బోర్డు కార్యాలయాన్ని నిర్మించినందున తనకు సమన్లు అందాయని అందులో పేర్కొన్నారు.