Omicron Wave : దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు అనూహ్యంగా పెరుగుతుండటంతో ఒమిక్రాన్ వ్యాప్తితో జనవరి నెలాఖరులో కొవిడ్-19 తదుపరి వేవ్ ముమ్మర దశకు చేరుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నెలాఖరు నాటికి భారత్లో రోజూ 4 నుంచి 8 లక్షల కేసులు వెలుగుచూసే అవకాశం ఉందని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మహీంద్ర అగర్వాల్ పేర్కొన్నారు. థర్డ్ వేవ్ మార్చి నాటికి సమసిపోతుందని అంచనా వేశారు.
జనవరి మధ్యలో ఢిల్లీ, ముంబైలో ఒమిక్రాన్ వేవ్ ముమ్మర దశకు చేరుకుంటుందని ఈ రెండు సిటీల్లో అప్పటికి రోజుకు 30,000 నుంచి 50,000 కేసులు నమోదవుతాయని పేర్కొన్నారు. కఠిన లాక్డౌన్ల ద్వారా ఈ వేవ్లను నియంత్రించవచ్చని అది మహమ్మారి కొనసాగేందుకు దోహదపడుతుందని అన్నారు. లాక్డౌన్ విధించడం ద్వారా ఆరోగ్య సంరక్షణ వ్యవస్ధపై భారాన్ని నివారించవచ్చని చెప్పారు.
లాక్డౌన్ విధించకుంటే మార్చి నాటికి కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టవచ్చని అంచనా వేశారు. మార్చి మాసాంతానికి కేసుల సంఖ్య రోజుకు 10,000 నుంచి 20,000కు పరిమితమవుతుందని మహీంద్ర అగర్వాల్ తెలిపారు. ఒమిక్రాన్ వ్యాప్తితో కొవిడ్-19 కేసుల సంఖ్య పెరుగుతున్నా పడకల ఆక్యుపెన్సీ తక్కువగానే ఉంటుందని చెప్పారు. మరోవైపు భారత్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య జనవరి మాసాంతం లేదా ఫిబ్రవరి ప్రధమార్ధంలో ముమ్మర దశకు చేరుతుందని ఐహెచ్ఎంఈ డైరెక్టర్ డాక్టర్ క్రిష్టాఫర్ ముర్రే సైతం ఇటీవల అంచనా వేశారు.