న్యూఢిల్లీ: ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) అంటేనే ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించే సంస్థ. ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారంటే నెలనెలా లక్షల్లో జీతం వాళ్ల సొంతమైనట్లే. మూడు రోజుల క్రితం ట్విట్టర్ సీఈవోగా నియమితులైన పరాగ్ అగర్వాల్ ఐఐటీ-ముంబై పూర్వ విద్యార్థి. అంతేగాక ఆల్ఫబెట్, గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఐఐటీ-ఖరగ్పూర్లో ఇంజినీరింగ్ చదివిన వారే.
అంతటి ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందిస్తున్న ఐఐటీ-ఖరగ్పూర్ కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. 2021-2022 ఏడాదికి సంబంధించి జరుగుతున్న క్యాంపస్ ప్లేస్మెంట్స్ ద్వారా మూడో రోజైన శుక్రవారం ఒక్కరోజే 1,100 మంది ఐఐటీ-ఖరగ్పూర్ విద్యార్థులు ఉద్యోగాలు సంపాదించారు. ఐఐటీల చరిత్రలో ఇంత వేగంగా ఒక్కరోజే 1,100 విద్యార్థులకు ఉద్యోగాలు కల్పించడం ఆల్టైమ్ రికార్డు అని ఐఐటీ-ఖరగ్పూర్ ఒక ప్రకటనలో పేర్కొన్నది.
మొదటి రోజు జరిగిన ప్లేస్మెంట్స్ ప్రక్రియలో ఐఐటీ-ఖరగ్పూర్.. క్వాల్కమ్, మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎక్సెల్ సర్వీస్, గోల్డ్మాన్ సాచ్స్, జేపీఎంసీ, అమెరికన్ ఎక్స్ప్రెస్ లాంటి కంపెనీల నుంచి 235 జాబ్ ఆఫర్స్ను సొంతం చేసుకున్నది. సాఫ్ట్వేర్, అనలిటిక్స్, ఫైనాన్స్, కన్సల్టింగ్, కోర్ రంగాల్లో విద్యార్థులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నది. మొత్తం ఆఫర్స్లో 35 మంది విద్యార్థులకు ఇంటర్నేషనల్ ఆఫర్స్ దక్కాయి. వారిలో ఇద్దరికి రెండు ప్రముఖ కంపెనీలు రూ.2 కోట్లు, రూ.2.4 కోట్ల చొప్పున భారీ ఆఫర్ చేశాయి.