Oil-Gas | అండమాన్ నికోబార్ దీవులకు 139 కిలోమీటర్ల దూరంలో ఉన్న నార్కొండమ్ ద్వీపం సమీపంలో సెడిమెంటరీ బేసిన్లో గ్యాస్, చమురు నిక్షేపాలను గుర్తించారు. బేసిన్లో దాదాపు పది కిలోమీటర్ల పొడవున్న ద్రవపొరను గుర్తించారు. ఈ విషయం కాన్పూర్లోని ఐఐటీ పీహెచ్డీ విద్యార్థి హర్షద్ శ్రీవాస్తవ పరిశోధనలో వెల్లడైంది. హర్షద్ పరిశోధనా పత్రం అక్టోబర్లో జర్మన్ మ్యాగజైన్ జియో-మెరైన్ లెటర్లో ప్రచురితమైంది. శ్రీవాస్తవ ఐఐటీలోని ఎర్త్ సెన్సెస్ విభాగానికి చెందిన పీహెచ్డీ విద్యార్థి.
ఈ సందర్భంగా డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దిబాకర్ ఘోషల్ మార్గదర్శకత్వంలో శ్రీవాస్తవ పరిశోధన నిర్వహించారు. 2019లో ప్రారంభించిన పరిశోధన పూర్తయ్యేందుకు దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది. ఓఎన్జీసీ అందించిన డేటాను విశ్లేషించి ఈ పరిశోధన జరిపారు. రెండు దశలో జరుగనున్న పరిశోధనలో.. తొలి దశ విజయవంతమైంది. రెండో దశలో చమురు, గ్యాస్ నిర్ధారించనున్నారు. నార్కొండమ్ దీవికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో 2డీ సీస్మిక్ లైన్ నుంచి పరీక్షలు నిర్వహించారు.
సముద్రం లోతు సుమారు 1.5 కిలోమీటర్లు కాగా.. సముద్రపు అడుగుభాగంలో 650 మీటర్ల దిగువన 20 మీటర్ల వెడెల్పు, పది కిలోమీటర్ల పొడువు ఉన్న చమురు, గ్యాస్ మిశ్రమ పొర గుర్తించారు. ఓఎన్జీసీ అందించిన సీస్మిక్ డేటా సాయంతో పరిశోధన పూర్తి చేసినట్లు హర్షద్ తెలిపారు. డేటాను ఎయిర్గన్, హైడ్రోఫోన్తో సేకరించారు. రెండో దశలో వెల్లాగ్ డేటా పద్ధతి ద్వారా చమురు, గ్యాస్ ఉనికి నిర్ధారించనున్నట్లు హర్షద్ పేర్కొన్నారు. అయితే, ఈ ప్రక్రియ ఖరీదైన ప్రక్రియ. నీటిలోకి పైపులను చొప్పించి.. గ్యాస్, చమురు నిల్వలను గుర్తించనున్నారు.