న్యూఢిల్లీ: కరోనా నుంచి కోలుకున్న ఒక వ్యక్తి కొన్ని వారాల్లోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాడు. తమ పూర్వ విద్యార్థి ఈ ఘనతను సాధించడంపట్ల ఐఐటీ ఢిల్లీలో శుక్రవారం ఒక కార్యక్రమాన్ని నిర్వహించి అతడ్ని అభినందించారు. 37 ఏండ్ల నీరజ్ చౌదరి, 2009-11లో ఢిల్లీ ఐఐటీలో ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ అండ్ మేనేజ్మెంట్లో ఎంటెక్ చేసాడు. ప్రస్తుతం ఆయన రాజస్థాన్ ప్రభుత్వ జల వనరుల విభాగంలో పనిచేస్తున్నాడు.
నీరజ్కు పర్వతారోహణ అంటే ఎంతో ఇష్టం. ఈ నేపథ్యంలో 2014లో పర్వతారోహణకు వెళ్ళాడు. 2020లో యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇండియన్ పర్వతారోహణ ఫౌండేషన్ (ఐఎంఎఫ్) నిర్వహించే ఎవరెస్ట్ సాహస యాత్రలో సభ్యుడిగా ఎంపికయ్యాడు. అయితే, కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి వల్ల ఈ యాత్ర వాయిదా పడింది.
మరోవైపు, ఈ ఏడాది ఎలాగైనా ఎవరెస్ట్ను అధిరోహించాలన్న పట్టుదలతో ఉన్న నీరజ్ మార్చిలో తన బృందంతో కలిసి నేపాల్ రాజధాని కాఠ్మండు చేరుకున్నాడు. అయితే, మార్చి 27న నిర్వహించిన కరోనా పరీక్షలో అతడికి పాటిజివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో నీరజ్ ఏప్రిల్లో తిరిగి జైపూర్కు చేరుకున్నాడు. కాగా, ఎవరెస్ట్ అధిరోహించేందుకు తనకు వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని అతడు భావించాడు. దీని కోసం శరీరకంగా, మానసికంగా సిద్ధమయ్యాడు.
కరోనా నుంచి కోలుకున్న నీరజ్ కొన్ని వారాల్లోనే తిరిగి కాఠ్మండు వచ్చాడు. అయితే భారత్లో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు, తుఫాను రాక వార్తలు నీరజ్తోపాటు అతడి కుటుంబాన్ని ఆందోళనకు గురి చేశాయి. అయినప్పటికీ నీరజ్ పట్టుదలతో ఎవరెస్ట్ అధిరోహణ కొనసాగించాడు. 36 గంటల సమయంలో మూడు సార్లు ప్రయత్నించి చివరకు మే 31న ఎవరెస్ట్ను అధిరోహించాడు. జాతీయ పతాకంతోపాటు ఐఐటీ ఢిల్లీ ఫ్లాగ్ను శిఖరంపై ఉంచాడు. తన పర్వతాహరణ కోసం ఐఐటీ ఢిల్లీ అసోసియేషన్ రూ.24 లక్షలు సేకరించి సహాయం చేసిందని నీరజ్ తెలిపాడు.
మరోవైపు తమ పూర్వ విద్యార్థి నీరజ్ సాధించిన ఘనతను పురస్కరించుకుని ఢిల్లీ ఐఐటీలో శుక్రవారం జెండా వేడుకను నిర్వహించారు. క్యాంప్ 2 నుంచి నేరుగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన నీరజ్ను ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వీ రామ్గోపాల్ రావు అభినందించారు.