హైదరాబాద్ : జూన్ 2021 టర్మ్ ఎండ్ ఎగ్జామినేషన్(టీఈఈ) దరఖాస్తుల సమర్పణ గడువును ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో) పొడిగించింది. పరీక్షలు జూన్ 15 నుండి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. మహమ్మారి పరిస్థితిని సమీక్షించిన అనంతరం నూతన తేదీలు ప్రకటించబడతాయని తెలిపింది. విద్యార్థులు తమ దరఖాస్తులను అధికారిక ignou.ac.in వెబ్సైట్లో సమర్పించవచ్చు. జూన్ 15 వరు దరఖాస్తు ఫారాలను సమర్పించవచ్చు.
అదేవిధంగా జూన్ 2020, డిసెంబర్ 2020 టర్మ్-ఎండ్ పరీక్షలకు హాజరు కాలేకపోయిన విద్యార్థుల నమోదు చెల్లుబాటును వర్సిటీ పొడిగించింది. వారి నమోదు ఇప్పుడు జూన్ వరకు చెల్లుబాటు అవుతుందని వెల్లడించింది. దరఖాస్తు రుసుము రూ.200. విద్యార్థులు ఎంపిక చేసుకున్న కేంద్రాలను కేటాయించేందుకే యూనివర్సిటీ ప్రయత్నిస్తుందని ఒకవేళ అవి నిండి ఉంటే అభ్యర్థులు ప్రత్యామ్నాయ పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవాలంది. పరీక్షకు కనీసం 7 నుండి 10 రోజుల ముందు అడ్మిట్ కార్డులు జారీ చేయబడతాయంది.