న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్లో చీలిక రానున్నదా? మాజీ సీఎం అమరీందర్ సింగ్ వ్యాఖ్యలు దీనికి అద్దం పట్టేలా ఉన్నాయి. పార్టీ మెజారిటీని కోల్పోతే అసెంబ్లీ స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. పంజాబ్ అసెంబ్లీలో ఫ్లోర్ టెస్ట్ గురించి మీడియా అడిగిన ప్రశ్నపై అమరీందర్ సింగ్ ఈ మేరకు సమాధానమిచ్చారు. తాను కాంగ్రెస్ పార్టీలో లేనన్న ఆయన బీజేపీలో చేరడం లేదని మరోసారి స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ను వీడుతున్నానన్న ఆయన పంజాబ్లో కొత్త పార్టీ ఏర్పాటుపై పరోక్షంగా సంకేతం ఇచ్చారు.
రైతుల నిరసనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, దేశ భద్రతకు సంబంధించిన అంశంపై జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ను తాను ఢిల్లీలో కలిసినట్లు అమరీందర్ వివరించారు. భద్రతా పరమైన అంశాలను చర్చించానన్న ఆయన, వాటి గురించి ఇక్కడ చెప్పకూడదని మీడియాతో అన్నారు. తాను ముందే చెప్పినట్లుగా పంజాబ్కు నవజ్యోత్ సింగ్ సిద్ధూ సరైన వ్యక్తి కాదన్నారు.
తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పంజాబ్లో ఎందరో కాంగ్రెస్ చీఫ్గా ఉన్నారని, అయితే సిద్ధూ మాదిరిగా గతంలో ఎవరూ ప్రవర్తించలేదని అమరీందర్ విమర్శించారు. ఒకవేళ ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తే తాను గెలువనివ్వబోనని మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకున్న అమరీందర్ పంజాబ్కు చేరుకున్నారు.