Eknath Shinde | మహారాష్ట్ర అధికార కూటమిలో నెలకొన్న రాజకీయ సంక్షోభం మరో మలుపు తిరిగింది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ఠాక్రే వారసత్వంపై పట్టు కోసం అధినేత ఉద్ధవ్ ఠాక్రే, రెబెల్స్ నేత ఏక్నాథ్ షిండే గ్రూప్ పోటీ పడుతున్నాయి. దాదాపు 40 మంది శివసేన ఎమ్మెల్యేలతో బీజేపీ పాలిత అసోం రాజధాని గువాహటిలో శిబిరం ఏర్పాటు చేసిన షిండే మద్దతు దారు.. శివసేన ఎమ్మెల్యే దీపక్ కేసర్కార్ స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఒకవేళ తమ గ్రూప్కు గుర్తింపు రాకపోతే న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఏక్నాథ్ షిండే గ్రూప్.. తమ పార్టీ పేరు శివసేన బాలాసాహెబ్ అని నామకరణం చేసింది. శివసేన బాలా సాహెబ్ అంటే బాల్ఠాక్రే సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పాటైన పార్టీ అని దీపక్ కేసర్కార్ వ్యాఖ్యానించారు. తమ గ్రూప్కు గుర్తింపు ఇవ్వాలని ఏక్నాథ్ షిండే గ్రూప్ డిమాండ్ చేస్తున్నా.. అది కేంద్ర ఎన్నికల సంఘం మాత్రమే చేయాల్సి ఉంటుంది.
మాకు సంఖ్యా బలం ఉంది. కానీ మేం పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను గౌరవిస్తాం. ఏ ఇతర పార్టీలోనూ మా పార్టీ విలీనం కాదు అని దీపక్ కేసర్కార్ చెప్పారు. ఒకవేళ మా గ్రూప్కు గుర్తింపు లభించకపోతే మేం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మా సంఖ్యా బలాన్ని రుజువు చేసుకుంటాం అని అన్నారు.
ఒక్క ఎమ్మెల్యే కూడా శివసేనను వీడడని, కానీ, తాము బాలా సాహెబ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాం అని దీపక్ కేసర్కార్ వ్యాఖ్యానించారు. తామేమీ తప్పు చేయడం లేదని దీపక్ కేసర్కార్ అన్నారు. తాము బాలాసాహెబ్ సిద్ధాంతాలను విడనాడటం లేదన్నారు. తమ గ్రూప్ గుర్తింపు కోసం జరిగే పోరాటం రాజ్యాంగబద్ధమైందని చెప్పారు.