న్యూఢిల్లీ: తాను నోరు విప్పితే సునామీ వస్తుందని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ హెచ్చరించారు. ప్రజల ద్వారా ఎన్నికైన తాను ఎవరి దయ వల్ల ఈ పోస్ట్లో లేనని అన్నారు. రెజ్లింగ్ బాడీ చీఫ్ పదవికి రాజీనామా చేసే ప్రస్తక్తే లేదని చెప్పారు. ప్రధాని కార్యాలయం లేదా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో తాను మాట్లాడలేదని మీడియాతో శుక్రవారం అన్నారు. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ సమన్లు జారీ చేసినా ఆయన పట్టించుకోలేదు. ఉద్రిక్తతలు పెంచేలా ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయవద్దని చెప్పినా లెక్కచేయలేదు.
కాగా, రెజ్లింగ్ బాడీ చీఫ్ బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధిస్తున్నట్లు మహిళా రెజ్లర్లు ఆరోపించారు. వినేశ్ ఫొగాట్, ఇతర స్టార్ రెజర్లు ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద గత మూడు రోజులుగా నిరసన చేస్తున్నారు. బ్రిజ్ భూషణ్ను ఆ పదవి నుంచి తొలగించాలని, ఆయనపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాగూర్ గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం ఉదయం 2 గంటల వరకు సుమారు నాలుగు గంటలపాటు నిరసనకారులతో చర్చలు జరిపారు. అయితే నిరసన చేస్తున్న రెజ్లర్లు వెనక్కి తగ్గలేదు. బ్రిజ్ భూషణ్ రాజీనామాతోపాటు ఆయనపై చర్యలకు పట్టుబట్టారు.
కాగా, భారత ఒలింపిక్ కమిటీ చీఫ్ పీటీ ఉషకు కూడా రెజ్లర్లు శుక్రవారం లేఖ రాశారు. తమను మానసికంగా వేధిస్తున్న బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తమ ప్రాణాలకు ముప్పు కలుగుతుందని, ఆత్మహత్యే శరణ్యమని అందులో పేర్కొన్నారు.