manipur| ఇంఫాల్:మణిపూర్ సీఎం బీరేన్ సింగ్ తక్షణమే రాజీనామా చేయాలని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ డిమాండ్ చేశారు. మణిపూర్లో నగ్నంగా ఊరేగించిన ఇద్దరు బాధిత మహిళలను మంగళవారం ఆమె పరామర్శించారు. ‘ఎలాంటి భద్రత లేకుండా నేను బాధితులను కలిశాను. నేను వారిని కలవగలినప్పుడు సీఎం ఎందుకు కలవలేరు? తన బుల్లెట్ ప్రూఫ్ కారులో.. ప్రభావిత ప్రాంతాల్లో ఎందుకు పర్యటించలేరు?’ అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఒక్కరు కూడా తమను కలవలేదని బాధిత మహిళలను తనతో చెప్పినట్లు మలివాల్ తెలిపారు. జాతుల మధ్య వైరంతో రెండున్నర నెలలుగా రగులుతున్న మణిపూర్లో పర్యటించాలని ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మహిళా సంక్షేమ శాఖ మంత్రి స్మృతీ ఇరానీని కోరారు.
రాష్ట్ర గవర్నర్ అనసూయతో మలివాల్ మంగళవారం సమావేశమయ్యారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘మణిపూర్ రగులుతున్నది. ఇప్పడు సరైన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రాన్ని సేవ్ చేయడం కష్టం’ అని వ్యాఖ్యానించారు. సీఎం పదవిలో కొనసాగేందుకు బీరేన్ సింగ్ అనర్హుడని, పదవి నుంచి దిగిపోవాలని కేంద్రం ఆయనను ఆదేశించాలని మలివాల్ కోరారు.