లక్నో: కరోనా రోగి ఇతర అనారోగ్య కారణాలతో చనిపోయినప్పటికీ అది కరోనా మరణమేనని హైకోర్టు స్పష్టం చేసింది. కరోనా రోగులు చికిత్స పొందుతూ ఇతర అనారోగ్య సమస్యలతో చనిపోయినప్పటికీ వారిని కరోనా మృతులుగా పరిగణించాలని, సంబంధిత పరిహారాన్ని నెల రోజుల్లో అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ గడువులోగా పరిహారం చెల్లించకపోతే 9 శాతం వడ్డీతో కలిపి ఇవ్వాలని పేర్కొంది. ఉత్తర ప్రదేశ్లోని అలహాబాద్ హైకోర్టు ఈ మేరకు శనివారం తీర్పు ఇచ్చింది.
దేశంలో కరోనాతో మరణించిన వారికి ఇచ్చే పరిహారం కోసం గత ఏడాది జూన్ 1న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఇందులోని 12వ నిబంధనను పిటిషనర్లు సవాల్ చేశారు. కరోనాతో చికిత్స పొందుతూ గుండెపోటుతో తన భర్త మరణించినట్లు ఒక మహిళ పేర్కొంది. అయితే ప్రభుత్వ ఉత్తర్వులోని 12వ నిబంధన కింద ఆ మరణానికి కారణం కోవిడ్ 19 కానందున పరిహారాన్ని నిరాకరించినట్లు ఆమె ఆరోపించింది. దీంతో ఆ మహిళతోపాటు మరికొందరు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు.
జస్టిస్ ఏఆర్ మసూది, జస్టిస్ విక్రమ్ డీ చౌహాన్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ పిటిషన్లపై విచారణ జరిపింది. కరోనా సోకిన రోగి ఆసుపత్రిలో చేరిన తర్వాత చికిత్స పొందుతూ మరణిస్తే, కారణంతో సంబంధం లేకుండా వారి మరణాన్ని కోవిడ్ మరణంగా పరిగణించాలని స్పష్టం చేసింది. కోవిడ్-19 ఇన్ఫెక్షన్ ఏదైనా అవయవాన్ని ప్రభావితం చేసి, దానిని దెబ్బతీస్తుందని, తద్వారా రోగి మరణానికి దారి తీస్తుందని ధర్మాసనం తెలిపింది.
ఈ నేపథ్యంలో కోవిడ్ సోకిన రోగి గుండెపోటు లేదా అవయవ వైఫల్యం కారణంగా చనిపోతే ఆ మరణాన్ని ప్రత్యేక కారణంగా పరిగణించలేమని కోర్టు పేర్కొంది. దీనిని కోవిడ్ -19 మరణంగానే పరిగణించాలని స్పష్టం చేసింది. కోవిడ్ వల్ల మరణించిన వారిపై ఆధారపడిన వారికి రూ.25,000 ఎక్స్గ్రేషియా మొత్తాన్ని 30 రోజుల్లోగా చెల్లించాలని తీర్పు ఇచ్చింది. నెలలో రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించకపోతే, 9 శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని ఆదేశించింది.