బెంగళూరు, మార్చి 5: మేం చూపించిన ట్రైలర్ (రామేశ్వరం కెఫేలో పేలుడు) బాగుందా? అంటూ గుర్తు తెలియని వ్యక్తులు కర్ణాటక సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్లకు ఈమెయిల్ ద్వారా లేఖ పంపారు. ఇది ట్రైలర్ మాత్రమే, తమకు రూ.20 కోట్లు (2.5 మిలియన్ డాలర్లు) ఇవ్వకుంటే.. మరిన్ని చోట్ల బాంబులు పెడతామని దుండగులు లేఖలో బెదిరింపులకు దిగారు.
ఈ విషయాన్ని డీకే శివకుమార్ మంగళవారం మీడియాకు తెలియజేశారు. ‘షాహిద్ ఖాన్ 10786’ నుంచి తనకు బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్టు చెప్పారు. రామేశ్వరం కెఫేలో బాంబు పేలుడు తర్వాత కర్ణాటక ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తాజాగా సీఎం, డిప్యూటీ సీఎంలకు బెదిరింపు లేఖలు రావటం తీవ్ర కలకలం రేపుతున్నది. ‘మూడు రోజుల క్రితం సీఎం సిద్దరామయ్య, నాకు ఈమెయిల్ ద్వారా బెదిరింపు లేఖలు వచ్చాయి. దీనిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు’ అని డీకే శివకుమార్ చెప్పారు. తనకు వచ్చిన బెదిరింపు మెయిల్ను మీడియాకు చూపించారు.