న్యూఢిల్లీ: రాజ్యసభలో గత సమావేశాల చివరి రోజున అనుచితంగా వ్యవహరించిన 12 మంది ఎంపీలపై సోమవారం సస్పెన్షన్ విధించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎంపీలు క్షమాపణలు చెబితే, వారిపై విధించిన సస్పెన్షన్ ఎత్తివేస్తామని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఎన్నో కీలక బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తోందని, విపక్ష సభ్యులందరూ ఆరోగ్యకరమైన చర్చలో పాల్గొవాలని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. నియమావళి ప్రకారం ప్రతి అంశాన్ని చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ప్రతి ప్రశ్నకు జవాబు ఇస్తామని, ఇవాళ్టి నుంచి కీలక బిల్లులను సభలో ప్రవేశపెడుతామని, సభ హుందాగా నడిచేందుకు విపక్షాలు సహకరించాలని మంత్రి జోషి కోరారు.
మరోవైపు విపక్ష నేతలు ఇవాళ పార్లమెంట్లోని మల్లిఖార్జున్ ఖర్గే ఆఫీసులో భేటీ అయ్యారు. ఆ నేతల్లో టీఆర్ఎస్ ఎంపీ కేశవరావు కూడా ఉన్నారు. 12 మంది ఎంపీల సస్పెన్షన్ అంశంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని వాళ్లు చర్చించారు. బ్యాంకుల ప్రైవేటీకరణ కోసం పోరాటం చేశామని, మేం క్షమాపణలు చెప్పమని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం తెలిపారు. సస్పెన్షన్కు గురైన ఎంపీల్లో బినోయ్ ఉన్నారు.