ముంబై: 2008 సెప్టెంబర్ 26న ముంబైలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. నగరంలోని ఛత్రపతి శివాజీ టర్మినల్ రైల్వే స్టేషన్లో పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఊచకోతకు పాల్పడ్డాడు. పోలీసులకు చిక్కిన కసబ్కు ఆ తర్వాత ఉరిశిక్ష పడిన విషయం తెలిసిందే. అయితే ఆ ఉగ్రవాది కసబ్ను కేసు విచారణ సమయంలో కోర్టులో గుర్తు పట్టినట్లు దేవికా రోత్వాన్ అనే అమ్మాయి తెలిపింది.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఇవాళ ఆయన ముంబైలోని తాజ్ హోటల్ లో ఉన్న స్మారకం వద్ద నివాళి అర్పించారు. ఆ తర్వాత ముంబై ఉగ్రదాడిలో ప్రాణాలతో బయటపడ్డ దేవికా రోత్వాన్తో ఆయన మాట్లాడారు. ఉగ్రదాడి జరిగిన రోజున ఛత్రపతి శివాజీ స్టేషన్లో గాయపడినట్లు గుటెర్రస్తో దేవిక చెప్పింది. ఆ దాడిలో దేవికకు బుల్లెట్ దిగింది.
ఇక కోర్టులోనూ కసబ్ను గుర్తించినట్లు ఆమె యూఎన్ చీఫ్కు తెలిపింది. గుటెర్రస్తో మాట్లాడిన దేవికా తాను ఉన్నత చదువుకోవాలని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. ఆఫీసర్ కావాలని ఉందని, ఉగ్రవాదాన్ని అంతం చేయాలని ఉందని కూడా ఆమె గుటెర్రస్కు చెప్పింది. గుటెర్రస్తో పాటు మహా సీఎం, డిప్యూటీ సీఎంలు కూడా ముంబై ఉగ్రదాడి మృతులకు నివాళి అర్పించారు.