ముంబై: వీడియోకాన్-ఐసీఐసీఐ బ్యాంక్ మనీలాండరింగ్ కేసులో నిందితులుగా ఉన్న చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్లను మూడు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. ఇప్పటికే చందాకొచ్చర్ దంపతులను సీబీఐ మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించింది.
ఇవాళ ఉదయం వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ ధూత్ను కూడా సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. అనంతరం ముగ్గురిని మరోసారి ముంబైలోని సీబీఐ స్పెషల్ కోర్టులో హాజరుపర్చారు. కొచ్చర్ దంపతుల మూడు రోజుల కస్టడీ ఇవాళ్టితో ముగిసినందున వారిని మరో మూడు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు.
వేణుగోపాల్ ధూత్ను కూడా మూడు రోజుల కస్టడీకి అప్పగించాలని, ముగ్గురిని కలిపి ఓకేసారి విచారిస్తే కేసు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని కోర్టుకు సీబీఐ అధికారులు విన్నవించారు. కాగా, సీబీఐ వినతిపై స్పెషల్ కోర్టు రేపు నిర్ణయం వెల్లడించే అవకాశం ఉంది.